ఇక తెలంగాణలో 33 జిల్లాలు..! రేపటి నుండి మరో రెండు జిల్లాలు అందుబాటులోకి..!!
హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేడ్కర్ అడుగుజాడల్లో నడుస్తోంది. పరిపాలనకు చిన్న రాష్ట్రాలు, జిల్లాలు అనుకూలంగా ఉంటాయని చెప్పిన ఆయన సూత్రాలను తూచా తప్పకుండా పాటిస్తోంది. అందులో భాగంగా తెలంగాణలో మరో రెండు కొత్త జిల్లాల పరిపాలన ప్రారంభం కానుంది. ఈ నెల 17 లేదా 19వ తేదీ నుంచి కొత్తగా రెండు జిల్లాలు ఉనికిలోకి రానున్నాయి. ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు నారాయణపేట, ములుగు జిల్లాల ఏర్పాటుకు కేసీఆర్ పచ్చజెండా ఊపారు.
దీనికి అనుగుణంగా గతేడాది డిసెంబరు 31న రెండు జిల్లాల ఏర్పాటుకు ముసాయిదా నోటికేషన్ జారీ చేసి ప్రజల నుంచి అభ్యంతరాలు, సలహాలు, సూచనలను ప్రభుత్వం స్వీకరించింది. ఆ తర్వాత వచ్చిన అభ్యంతరాలు, సలహాలు అనుసరించి రెండు జిల్లాల ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఈ రెండు జిల్లాల ఏర్పాటుకు తుది నోటిఫకేషన్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నెల 17వ తేదీ నుంచే ఈ రెండు కొత్త జిల్లాలు మనుగడలోకి వస్తాయని అధికారవర్గాలు చెప్పాయి.
అయితే, 19న మంచి రోజు కావడం మంత్రివర్గ విస్తరణ అదే జరగనుండటంతో, జిల్లాల ఏర్పాటు నిర్ణయాన్ని వాయిదా వేసి ఆ తేదీ నుంచే కొత్త జిల్లాల్లో పరిపాలన ప్రారంభించాలని కూడా ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు సూచించారు. తుది నోటిఫికేషన్ శనివారమే వస్తే, ఆదివారం నుంచే జిల్లాలలో పాలన మొదలవుతుంది. లేదా 19నుంచి ప్రారంభం అవుతుంది. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణలో పది జిల్లాలు ఉండేవి.
తెలంగాణ ఏర్పడిన తర్వాత చంద్రశేఖర్ రావు ముఖ్యమంత్రి అయ్యాక ఎన్నికల హామీ మేరకు కొత్త జిల్లాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. 2016 అక్టోబరు నుంచి 31 జిల్లాలు ఏర్పాటు చేసి పరిపాలన ప్రారంబించారు. అప్పుడే నారాయణపేట, ములుగు జిల్లాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ వచ్చినా పట్టించుకోలేదు. గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో రెండో సారి అధికారంలోకి వస్తే ఈ రెండు జిల్లాలు ఏర్పాటు చేస్తామని చంద్రశేఖర్ రావు హామీ ఇచ్చారు. ఆ ప్రకారం అధికారంలోకి వచ్చాక రెండు జల్లాల ఏర్పాటుకు చర్యలు చేపట్టారు.