అమరావతిలో 35 మీటర్ల ఎన్టీఆర్ విగ్రహం, భారతరత్న ఇవ్వాలి: బాబు
తిరుపతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతిలో భారీ ఎన్టీఆర్ విగ్రహాన్ని స్థాపించనున్నట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు. శనివారం మహానాడులో ఆయన ప్రసంగించారు. 35 మీటర్ల ఎత్తు (115.5 అడుగుల ఎత్తు) ఎన్టీఆర్ విగ్రహాన్ని స్థాపించి తెలుగుజాతి ఆత్మగౌరవ స్ఫూర్తిగా నామకరణం చేయనున్నట్లు ఆయన తెలిపారు.
ఎన్టీ రామారావుకు భారత రత్న ఇవ్వాలని ఆయన కేంద్రాన్ని కోరారు. ఈ మేరకు మహానాడులో తీర్మానం చేయనున్నట్లు చెప్పారు. ఎన్టీ రామారావు స్ఫూర్తితో పనిచేస్తే సాధించలేనిదంటూ ఏదీ ఉండదని. ఆయన స్ఫూర్తితో మనం పనిచేయాలని ఆయన అన్నారు. దేశ, రాష్ట్ర రాజకీయాల్లో ఎన్టీ రామారావుది విభన్నమైన శైలి అని చెప్పారు.
సమాజమే దేవాలయం, పేదలే దేవుళ్లు అని ప్రకటించిన ఎన్టీఆర్ ఇచ్చిన నినాదం తనకు స్ఫూర్తిని ఇచ్చిందని ఆయన చెప్పారు. ఆ నినాదం ఇచ్చిన తొలి మహానాయకుడు ఎన్టీఆర్ అని ఆయన చెప్పారు. మిగులు జలాలపై మనకు హక్కు ఉందనే ఉద్దేశంతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్టీఆర్ పలు సాగునీటి ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టారని ఆయన అన్నారు. తెలుగువారికి ఎన్టీఆర్ ఆరాధ్యదైవమని అన్నారు.
రాజకీయ నాయకుడిగా ఎన్టీఆర్ ఆదర్శంగా జీవించాడని, ప్రత్యర్థుల గుండెల్లో రైళ్లు పరుగెత్తించాడని అన్నారు. సినిమాల్లో ఎన్టీఆర్ విభన్నమైన పాత్రలు పోషించారని, ఆయన దేవుళ్ల పాత్రల్లో జీవించారని అన్నారు. ఎన్టీఆర్ స్ఫూర్తితో కళలను, సంప్రదాయాన్ని, కుటుంబ వ్యవస్థను కాపాడుకుందామని ఆయన పిలుపునిచ్చారు. ఈ ఏడాది పేదల కోసం అన్న క్యాంటీన్లను ప్రారంభిస్తామని చంద్రబాబు చెప్పారు.