ఉస్మానియా మెడికల్ కాలేజీలో ర్యాగింగ్: దుస్తులు విప్పించి మోకాళ్లపై నిలబెట్టారు
హైదరాబాద్: ప్రభుత్వాలు, పోలీసులు ఎన్ని చర్యలు తీసుకున్నప్పటికీ ర్యాగింగ్ భూతం కళాశాలలను వీడటం లేదు. తాజాగా మరోసారి కోఠిలోని ఉస్మానియా మెడికల్ కళాశాలలో ర్యాగింగ్ భూతం పడగవిప్పింది. ఇటీవల ఈ వైద్య కళాశాలలోనే హౌస్ సర్జన్లపై లైంగిక వేధింపులు మరువకముందే మరోమారు ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది.
తమకు మర్యాద ఇవ్వడం లేదని జూనియర్ విద్యార్థుల దుస్తులు విప్పించి మోకాళ్లపై నిలబెట్టి సీనియర్ విద్యార్థులు దారుణంగా ర్యాగింగ్ చేశారు. దీనిపై బాధిత విద్యార్థులు సుల్తాన్బజార్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఘటన వెలుగులోకి వచ్చింది.
సుల్తాన్బజార్ ఇన్స్పెక్టర్ శివశంకర్ కథనం ప్రకారం... కోఠి ఉస్మానియా మెడికల్ కళాశాల సీనియర్ విద్యార్థులు తమకు జూనియర్లు మర్యాద ఇవ్వడంలేదనే అక్కసుతో డిసెంబర్ 9వ తేదీన వారిని కళాశాలలోని హాస్టల్కు పిలిపించారు. అనంతరం వారి దుస్తులు విప్పించి రెండు గంటలపాటు మోకాళ్లపై నిల్చోబెట్టి ర్యాగింగ్కు పాల్పడ్డారు.
ఎవరికైనా చెబితే బాగుండదని హెచ్చరించారు. దీంతో బాధిత విద్యార్థులు ర్యాగింగ్ విషయాన్ని బయటకు వెల్లడించలేదు. కాగా, వారిలో కొందరు బుధవారం ఈ విషయమై ఫిర్యాదు చేయడంతో సుల్తాన్బజార్ పోలీసులు ఉస్మానియా మెడికల్ కళాశాల హాస్టల్కు వెళ్లి నలుగురు సీనియర్ విద్యార్థులను అరెస్ట్ చేశారు.
ఆ తర్వాత వారిని స్టేషన్ బెయిల్పై విడుదల చేశారు. ర్యాగింగ్కు పాల్పడితే చట్టపరమైన చర్యలు తప్పవని ఈ సందర్భంగా ఇన్స్పెక్టర్ శివశంకర్ హెచ్చరించారు. ర్యాగింగ్కు పాల్పడిన కేసులో ఇంకా ఎంతమంది సీనియర్ విద్యార్థులున్నారో పోలీసులు ఆరా తీస్తున్నారు.