నాలుగేళ్ల తెలంగాణ పాలనలో.. జీహెచ్ఎంసీ ప్రస్థానం... విజయమా..? విఫలమా..?
తెలంగాణను బంగారు తెలంగాణ గా మార్చడమే కాకుండా హైదరాబాద్ నగరాన్ని విశ్వనగరంగా మార్చుతామని తెలంగాణ ప్రభుత్వం చేసిన ప్రకటనలు కార్యారూపం దాల్చలేకపోయాయి. నగర రూపురేఖలు మార్చేందుకు మున్సిపల్ శాఖా మంత్రి కేటీఆర్ ప్రకటించిన ఆపరేషన్ 100రోజుల కార్యక్రమం ఆశించిన ఫలితం ఇవ్వకుండానే నీరుకారిపోయింది. దీంతో నగరంలో పేరుకు పోయిన సమస్యలు సమప్యలుగానే మిగిలిపోయాయి. నాలుగేళ్ల తెలంగాణ ప్రభుత్వ అభివ్రుద్ది మంత్రం కాగితాలకే పరిమితం అయిందని., ఆచరణలకు నోచుకొలేక పోయిందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
ఎక్కడి పనులు అక్కడే..ఫలితమివ్వని 100 రోజుల ప్రణాళిక..
హైదరాబాద్ నగరాన్ని విశ్వనగరంగా మార్చే క్రమంలో నగర అభివ్రుద్ది కోసం తెలంగాణ ప్రభుత్వం అట్టహాసంగా ఆపరేషన్ వంద రోజుల ప్రణాళికను ప్రకటించి రేండేళ్లు పూర్తి కావస్తోంది. కాని 100రోజుల ప్రణాళికలో భాగంగా 26 అభివ్రుద్ది అంశాలను చేర్చగా అందులో సగం వరకు పనులను ఇప్పటి వరకు ప్రారంభించక పోవడం నగరపాలక అదికారుల పని తీరుకు నిదర్శనంగా నిలుస్తోంది. మున్సిపల్ శాఖా మంత్రి కేటీఆర్ వినూత్న రీతిలో ప్రారంభించిన ఈ వందరోజుల అభివ్రుద్ది నినాదం చాలా వరకు జీహెచ్ఎంసీ ప్రహారీ గోడను కూడా దాటలేదని సామాన్య ప్రజలు పెదవి విరుస్తున్నారు. జంటనగరాల్లో రోడ్ల పరిస్థితిని కూడా చక్కబెట్టలేక పోతున్న మున్సిపల్ అదికారులపై నగరవాసులు ఆగ్రహంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఇంటింటికి నల్లా పేరుతో బస్తీల్లో తీసిన గుంటలు పూడ్చేందుకు చాలా సమయం తీసుకోవడం కూడా నగర వాసులకు చిర్రెత్తుకొస్తుంది. ఇక గంట వర్షం పడితే రోడ్లపై నిలుస్తున్న నీరు, గంటల తరబడి ట్రాఫిక్ నిలిచిపోవడం వంటి అంశాలు కూడా నగర వాసులను అసహనానికి గురిచేస్తున్నాయి. విశ్వనగరం అంటే ఇదేనా అని ప్రజలు విసుక్కునే పరిస్థితులు తలెత్తాయి.
ఆరంభ శూరత్వం.. అదికారుల అలసత్వం..
హైదరాబాద్ మహానగరంగా రూపాంతరం చెంది దాదాపు 135 చదరపు కిలోమీటర్లు విస్తరించింది. కోటిమంది జనాభాతో కిక్కిరిసింది. 150 మంది కార్పొరేటర్లతో ప్రత్యేక పాలకమండలి.. అధికార యంత్రాంగం అభివృద్ధికోసం నిరంతరం శ్రమిస్తున్నారని ప్రభుత్వం ప్రగల్బాలు పలుకుతోంది. ప్రపంచ ప్రసిద్ధి చెందిన పరిశ్రమలకు కేంద్రమైంది. ప్రపంచ నగరిగా విస్తరిస్తోంది. ఇన్ని గొప్ప లక్షణాలున్న భాగ్యనగరం మౌలిక సౌకర్యాల భాగ్యానికి మాత్రం నోచుకోలేదు. చాలావరకు వందల ఏళ్ల క్రితం నిజాములు ఏర్పాటు చేసిన వసతులే ఉన్నాయి. నగర రూపురేఖలు మార్చాలని ప్రపంచ గొప్ప నగరాల సరసన మనమూ నిలవాలని రాష్ట్ర మున్సిపల్శాఖ మంత్రి కేటీఆర్ ‘వంద రోజుల ప్రణాళిక'కు జీవం పోశారు. దీంతో సిటీ అద్భుతంగా మారిపోతుందని అంతా భావించారు. జీహెచ్ఎంసీ అధికారులు ఆర్భాటంగా పనులు ప్రారంభించారు. తర్వాత ఆరంభ శూరత్వంగా మిగిల్చారు. గతంలో చేపట్టిన పనులకు ‘వంద' రోజుల ముసుగు వేశారు తప్ప కొత్తగా చేసింది ఏమీ లేదని నగర తీరుతెన్నులు చెప్పకనే చెబుతున్నాయి.
విపలమైన జలమండలి.. ప్రకటనలకే పరిమితం..
రాష్ట్ర మున్సిపల్ మంత్రి కేటీఆర్ ప్రకటించిన ఈ మహా ప్రణాళిక అమలులో జీహెచ్ఎంసీ అధికారులు పూర్తిగా చతికిలపడ్డారు. జలమండలి అధికారులు అప్పటికే ప్రారంభించిన పనులకు వందరోజుల ముసుగు తొడిగి మమ అనిపించేశారు. చేయగలిగిన పనులు మాత్రమే ప్రణాళికలో పొందుపరచాల్సిందిగా మంత్రి సూచించినప్పటికీ, అత్యుత్సాహంతో 26 పనుల్ని ప్రణాళికలో పొందుపరచి బల్దియా అధికారులు అభాసుపాలయ్యారు. ఇందులో మహా అయితే 12 పనుల్ని మాత్రమే పూర్తిచేశారు. స్వచ్ఛ హైదరాబాద్ పేరుతో హడావుడి చేసిన మహానగర పాలక సంస్థ సిబ్బంది... కనీసం పబ్లిక్ టాయ్లెట్లను వినియోగంలోకి తేలేకపోవడం ఈ ప్రణాళిక అమలులో డొల్లతనం స్పష్టమవుతోంది. ఖాళీ స్థలాలకు ప్రహరీలు, పార్కుల్లో పిల్లల ఆటసామాగ్రి వంటి చిన్నచిన్న పనులను పూర్తిచేయడంలోనూ విఫలమవడం గ్రేటర్ అదికారుల పని తీరుకు అద్దం పడుతుంది. ఇక జలమండలి ఆధ్వర్యంలో చేపట్టిన పనులదీ అదే తీరు. హుస్సేన్సాగర్లో పారిశ్రామిక వ్యర్థజలాలు చేరకుండా చేపట్టిన నాలా మళ్లింపు పనులు సహా మరో 11 ముఖ్యమైన పనులకు వందరోజుల ముసుగు తొడిగి.. పని పూర్తయినట్లు సంబురాలు చేసుకోవడం గమనార్హం.
రోడ్ల పరిస్థితి ఇంకా అస్తవ్యస్తం..
ప్రజా రవాణా సదుపాయాలు మెరుగు పరిచేందుకు రోడ్లు బాగుచేయాలని ప్లాన్లో పేర్కొన్నారు. ఇందుకు రూ. 200 కోట్లతో 569 రహదారుల పనులు పూర్తి చేయాలని నిర్ణయించారు. కానీ 250 రహదారుల పనులే పూర్తి చేశారు. దీంతో షరా మామాలే.. నాలుగు చినుకులు పడితే రహదారులు కుంటలను తలపించే పరిస్థితి. ఎగుడు దిగుడు ప్రయాణాలతో ప్రజలకు అవస్థలు తప్పడం లేదు.వర్షం వస్తే నాలాలు పొంగి పోర్లుతున్నాయి. రోడ్లు నీట మునుగుతున్నాయి. ఇందుకు వేసవిలోనే నాలాల్లో పూడికతీత పనులు పూర్తి కాకపోవడమని గుర్తించారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు రూ. 22.79 కోట్లతో 826 కి.మీ. మేర 317 పనులు చేయాల్సి ఉంది. కానీ 285 పనులు మాత్రమే పూర్తి చేశారు. ఆయా ప్రాంతాల్లో పూడికను బయటకు తీసి నాలా పక్కనే వేసి వదిలేశారు. దీన్ని డంపింగ్ యార్డుకు తరలించక పోవడంతో తిరిగి మళ్లీ నాలాల్లోకే చేరింది. దీంతో చేసిన పనులకూ ప్రయోజనం లేకుండా పోయింది.
బస్బేల నిర్మాణం శూన్యం... ప్రయాణీకుల ఇబ్బందులు యదాతథం..
నగరంలో బస్టాప్ ఒక చోట ఉంటే, బస్సులు మరోచోట ఆగుతాయి. ప్రయాణికులు ఆగిన బస్సును అందుకోవాలని పరిగెత్తేలోగా అది వెళ్లిపోతుంది. మరో బస్సుకోసం గంటల తరబడి వేచి చూడాల్సిందే. ఈ పరిస్థితి మార్చేందుకు నిర్ణీత ప్రదేశంలో బస్సులాగే విధంగా.. ప్రయాణికులు సౌకర్యవంతంగా బస్సు ఎక్కేందుకు వీలుగా 50 బస్బేలను అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. ఇందుకు రూ. 3 కోట్ల నిధులు విడుదల చేశారు. వీటిల్లో 20 కూడా పూర్తి చేయలేకపోయారు. ప్రణాళికలో భాగంగా రూ.10 కోట్లతో పది శ్మశానవాటికలను అభివృద్ధి చేయాలని తలపెట్టారు. కానీ ఒక్క శ్మశానవాటికలోనే పని జరిగింది. మిగతా తొమ్మిదింటినీ గాలికి వదిలేశారు. శ్మశానవాటికల్లో సదుపాయాలు మెరుగుపరచి, అంత్యక్రియలకు హాజరైన వారికి పరిసరాలు ప్రశాంతతనిచ్చేలా పచ్చని మైదానాలు.. దుస్తులు మార్చుకునేందుకు ప్రత్యేక గదులు వంటి ఏర్పాట్లు చేయాలన్న లక్ష్యం కూడా నీరుగారింది.
పబ్లిక్ టాయ్ లెట్స్ ఊసే లేదు..
ప్రజల ‘అత్యవసర' పనులు తీర్చుకునేందుకు బహిరంగ ప్రదేశాలను పాడుచేయకుండా చూసేందుకు వందరోజుల్లో వంద ‘పబ్లిక్ టాయిలెట్ల'ను అందుబాటులోకి తెస్తామన్నారు. పనులు ఆలస్యం కాకూడదని ప్రీ ఫ్యాబ్రికేటెడ్ టాయిలెట్లను కూడా కొనుగోలు చేశారు. కానీ, ప్రజలకు సదుపాయం మాత్రం కల్పించలేకపోయారు. టాయిలెట్లయితే ఉన్నాయి. వాటి నిర్వహణ ఎవరికి అప్పగించాలో అర్థంకాక నిరుపయోగంగా వదిలేశారు. నిర్వహణ కాంట్రాక్టు కోసం టెండర్లు పిలిచారు. ప్రకటనల ఏర్పాటు ద్వారా వచ్చే ఆదాయంతో జీహెచ్ఎంసీయే నిర్వహించాలని ఒకసారి, ప్రకటనల ఆదాయాన్ని కాంట్రాక్టు సంస్థలే పొందేలా ఎవరు ఎక్కువ కాలం నిర్వహించేందుకు ముందుకు వస్తే వారికి అప్పగించాలని మరో సారి.. కాంట్రాక్టు ఏజెన్సీల డిమాండ్లు అడ్డగోలుగా ఉండటంతో ఎక్కడ ఉన్న టాయిలెట్లను వాటికి సమీపంలోని వ్యాపారులకే నిర్వహణ కివ్వాలని మరోసారి.. రకరకాల ఆలోచనలతోనే వంద రోజులు కరిగిపోయాయి. సమస్య మాత్రం నగర ప్రజలను, అదికారులను వెక్కిరిస్తూనే ఉంది.
పారిశుద్యానికి చర్యలు అంతంత మాత్రమే..
వంద రోజుల ప్రణాళికకు ముందే చెత్త సేకరణకు ఇంటింటికీ రెండు చెత్త డబ్బాల చొప్పున మొత్తం 44 లక్షల డబ్బాలను పంచాలని నిర్ణయించారు. ప్రణాళికను ప్రకటించే సమయానికి 14.22 లక్షల డబ్బాలు మాత్రమే పంపిణీ చేయాల్సి ఉంది. మిగతావి అప్పటికే పంపిణీ చేసేశారు. దీన్ని తెచ్చి ‘ప్లాన్'లో చేర్చారు. అయితే, వంద రోజులైనా ఇంకా పదివేల డబ్బాలను పంపిణీ అలాగే ఉండిపోయింది. బహిరంగ ప్రదేశాల్లో చెత్త కుప్పలు లేకుండా చేసేందుకు 1116 ప్రదేశాలను ‘చెత్త రహితం'గా చేయాలని కంకణం కట్టుకున్నారు. ఆయా ప్రదేశాల్లోని చెత్తను తొలగించడమే కాక, అక్కడ తిరిగి చెత్త వేయకుండా అందమైన ముగ్గులు, స్వచ్ఛ భారత్ నినాదాలతో వర్ణ చిత్రాలు వేస్తూ చిత్తశుద్ధితో ప్రయత్నిస్తున్నారు. అయినప్పకీ ఇప్పటి వరకు అన్ని ప్రాంతాల్లో పూర్తి చేయలేకపోయారు. దాదాపు 960 ప్రాంతాల్లో ఈ పనులు చేశారు. అలాగే నగరంలో 40 మోడల్ మార్కెట్లను నిర్మించాలని తలంచారు. ఇందుకు రూ. 26 కోట్లు అవసరమని అంచనా వేశారు. నిర్మాణ పనులు ప్రారంభించినప్పుడే పూర్తయినట్టు గొప్పలు చెప్పారు.