40 కిలోల గంజాయి పట్టివేత: నిందితుల్లో ఓ మహళ, కేసు నమోదు
రైలులో అక్రమంగా తరలిస్తున్న 40 కిలోల గంజాయిని రైల్వే పోలీసు పట్టుకున్నారు. ఓ మహిళ తన చిన్నపాపతో సహా మరో ముగ్గురు నిందితులను వెంటాడారు.
వరంగల్ :రైలులో అక్రమంగా తరలిస్తున్న 40 కిలోల గంజాయిని రైల్వే పోలీసు పట్టుకున్నారు. కాజీపేట రైల్వే సీఐ ఎస్. వెంకటేష్ ఆదివారం మీడియం సమావేశంలో తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. భువనేశ్వర్ నుంచి ముంబై వెళ్లే కోణార్క్ ఎక్స్ప్రెస్లో ఆదివారం గంజాయి రవాణా చేస్తున్నట్లు సమాచారం అందింది.
ఆ సమాచారం మేరకు వరంగల్ రైల్వే సీఐ జె. వెంకటరత్నం, కాజీపేట సీఐ ఎస్. వెంకటేశ్, ఆర్పీఎఫ్ జాయింట్గా విజయవాడ రైల్వేస్టేషన్ నుంచే రైల్వే స్పెషల్ టీం వెంటాడింది. తమకు అందిన సమాచారం మేరకు ఓ మహిళ తన చిన్నపాపతో సహా మరో ముగ్గురు నిందితులను వెంటాడారు.
స్పెషల్ పార్టీ పోలీసును చూసి నిందితులు తప్పించుకునే ప్రయత్నం చేయగా రైలు స్టేషన్ ఘన్పూర్ చేరుకోగానే వారిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వీరు ఎస్- 9 రిజర్వేషన్ కోచ్లో గంజాయి ఉందని తెలపడంతో స్వాధీనం చేసుకున్నామని, దీని విలువ లక్షల్లో ఉంటుందని తెలిపారు.
విచారణలో గంజాయిని తామే తరలిస్తున్నామని అంగీకరించారు. వీరిలో ఒడిశా రాష్ట్రం గంజాం జిల్లాకు చెందిన గడధర్ పాండా, సాన్స్వైన్, చిత్రసేన్ జేనాతో పాటు ఒడిశా, గజపతి జిల్లాకు చెందిన మీనాక్షి అనే మహిళ కూడా ఉన్నారు. నిందితులను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసినట్లు సీఐ వెంకటేశ్ తెలిపారు.