కరోనా అప్డేట్... తెలంగాణలో కొత్తగా 417 కరోనా కేసులు... వ్యాక్సిన్ పంపిణీకి 1500 కేంద్రాలు
తెలంగాణలో కొత్తగా 417 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గత రెండు రోజులతో పోలిస్తే కేసుల సంఖ్య పెరిగింది. రాష్ట్రంలో మరో ఇద్దరు కరోనాతో మృతి చెందారు. మరో 471 కేసుల రిపోర్టులు ఇంకా రావాల్సి ఉంది. ఈమేరకు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ బుధవారం (జనవరి 6) హెల్త్ బులెటిన్ విడుదల చేసింది.
తాజా కేసులతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 2,88,410కి చేరింది. మొత్తం మృతుల సంఖ్య 1556కి చేరింది. ప్రస్తుతం 4982 యాక్టివ్ కేసులు కొనసాగుతున్నాయి. 2748 మంది పేషెంట్లు హోమ్ ఐసోలేషన్లో చికిత్స పొందుతున్నారు.గడిచిన 24 గంటల్లో 472 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. ఇప్పటివరకూ రాష్ట్రంలో కరోనా నుంచి కోలుకున్నవారి సంఖ్య 2,81,872కి చేరింది.
గడిచిన 24గంటల్లో మొత్తం 43,318 శాంపిల్స్ను పరీక్షించారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకూ నిర్వహించిన కరోనా పరీక్షల సంఖ్య 71,04,367కి చేరింది. ఒక మిలియన్ జనాభాకు సగటున 1,90,874 కరోనా టెస్టులు చేస్తున్నట్లు బులెటిన్లో వెల్లడించారు. ప్రస్తుతం దేశంలో మరణాల రేటు 1.4శాతం ఉండగా... తెలంగాణలో 0.53శాతం ఉన్నట్లు తెలిపారు. జాతీయ స్థాయిలో రికవరీ రేటు 96.3 శాతం ఉండగా తెలంగాణలో 97.73శాతం ఉన్నట్లు తెలిపారు. తాజాగా అత్యధికంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 82,రంగారెడ్డి జిల్లాలో 34 కేసులు నమోదయ్యాయి.
ఇటీవలే కేంద్ర ప్రభుత్వం కరోనా ఎమర్జెన్సీ వ్యాక్సిన్లకు అనుమతినిచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వ్యాక్సిన్ల పంపిణీపై కేంద్ర ఆరోగ్యశాఖ, రాష్ట్రాల ప్రభుత్వాలు ఏర్పాట్లలో నిమగ్నమయ్యాయి. తెలంగాణలో వ్యాక్సిన్ పంపిణీకి మొత్తం 1,500 కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్టు రాష్ట్ర ప్రజా ఆరోగ్యశాఖ వెల్లడించింది. మొదట వైద్య ఆరోగ్యశాఖ సిబ్బందికి వ్యాక్సిన్ ఇవ్వనున్నట్లు చెప్పింది.
ఇక దేశవ్యాప్తంగా కరోనా మృతుల సంఖ్య లక్ష దాటింది. గడిచిన 24గంటల్లో 264 మంది కరోనాతో మృతి చెందడంతో మొత్తం మృతుల సంఖ్య 1,50,114కు చేరింది. కొత్తగా 18,088 కరోనా కేసులు నమోదు కావడంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,03,74,932కు చేరింది. ఇప్పటివరకూ 99,97,272 మంది కరోనా నుంచి కోలుకున్నారు. 2,27,546 మంది ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్లలో చికిత్స పొందుతున్నారు.