తెలంగాణలో నాలుగువేలకుపైనే కొత్త కేసులు: వినోద్ కుమార్కు కరోనా పాజిటివ్
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ కేసులు రోజు రోజుకు భారీగా పెరుగుతున్నాయి. రోజువారీగా నాలుగువేలకుపైగా కేసులు నమోదవుతున్నాయి. గత 24 గంటల వ్యవధిలో 1,16,224 నమూనాలను పరీక్షించగా.. 4393 మందికి కరోనా వైరస్ సోకినట్లు తేలింది. దీంతో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 7,31,212కి చేరింది.
గత 24 గంటల్లో కరోనా బారిన పడి ఇద్దరు మరణించారు. దీంతో ఇప్పటి వరకు నమోదైన కరోనా మరణాల సంఖ్య 4071కి చేరింది. తాజాగా, 2319 మంది కరోనా నుంచి కోలుకున్నారు. రికవరీ రేటు 95.18 శాతంగా ఉంది. జీహెచ్ఎంసీ పరిధిలో 1643 కరోనా కేసులు నమోదయ్యాయి. మేడ్చల్ జిల్లాలో 421 మంది, రంగారెడ్డి జిల్లాలో 286 మంది, హన్మకొండ జిల్లాలో 184, ఖమ్మం జిల్లాలో 128 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. ఇక, మిగిలిన జిల్లాల్లో 100 లోపే కరోనా కేసులు వెలుగు చూశాయి.
మరోవైపు తెలంగాణలో కరోనా వ్యాప్తి నియంత్రణకు చేపట్టిన ఫీవర్ సర్వే రెండో రోజు కొనసాగింది. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు 45, 567 మందిలో కరోనా లక్షణాలు ఉన్నట్లు గుర్తించారు వైద్య సిబ్బంది. వీరంతా జలుబు, దగ్గు, జ్వరం, గొంతు నొప్పితో బాధపడుతున్నారు. లక్షణాలున్న ప్రతి ఒక్కరికి హోమ్ ఐసొలేషన్ కిట్స్ను అందచేశారు.
కరోనా సెకండ్ వేవ్లో రెండు, మూడు దఫాలుగా ఫీవర్ సర్వే నిర్వహించింది వైద్య ఆరోగ్య శాఖ. ధర్డ్ వేవ్లో కేసులు ఎక్కువగా వస్తుండటంతో మళ్లీ రాష్ట్రవ్యాప్తంగా ఒకేసారి ఫీవర్ సర్వే చేపట్టారు అధికారులు. పల్లెలు, పట్టణాల్లో చేపట్టిన ఇంటింటా ఫీవర్ సర్వేకు.. ఒక్కో బృందంలో కనీసం ముగ్గురు సభ్యులు ఉన్నారు. ఒక్కో బృందం రోజుకు కనీసం 25 ఇళ్లలో సర్వే చేస్తోంది. ఇప్పటివరకు వ్యాక్సిన్ తీసుకోనివారిని గుర్తించి, అక్కడికక్కడే వ్యాక్సిన్ చేస్తున్నారు.
కాగా, ఫీవర్ సర్వేలో చిన్నారులు, పెద్దల నుంచి విడివిడిగా వివరాలు సేకరిస్తున్నారు. ఎక్కువగా పెద్దవారిలోనే కరోనా లక్షణాలు గుర్తించారు. కోవిడ్ లక్షణాలు ఉండి తీవ్రంగా ఇబ్బందిపడుతున్నవారికి టెస్ట్ చేస్తున్నారు. 5 రోజుల పాటు వారి ఆరోగ్యం ఎలా ఉందో తరచూ పరిశీలిస్తుంటారు. ఆరోగ్యం క్షీణిస్తుంటే... ఆస్పత్రిలో చేరుస్తారు. తెలంగాణలో మరో ఆరు రోజుల పాటు జ్వర సర్వే కొనసాగనుంది.
మరోవైపు, తెలంగాణ రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్కు కరోనా బారిన పడ్డారు. జ్వరం, జలుబు ఉండటంతో కరోనా టెస్టులు చేయించుకోగా ఆయనకు కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది. తనకు కరోనా సోకిందని వినోద్ కుమార్ పేర్కొన్నారు. స్వల్ప లక్షణాలు ఉన్నాయని, కరోనా నిబంధనలు పాటిస్తూ అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ప్రస్తుతం తాను హోం ఐసోలేషన్ లో ఉన్నట్లు వెల్లడించారు. ఇటీవల తనను కలిసినవారు కరోనా టెస్టులు చేయించుకోవాలని సూచించారు వినోద్ కుమార్.