తెలంగాణలో కొత్తగా 459 కరోనా కేసులు: హైదరాబాద్లోనే సగం, 4వేలు దాటిన యాక్టివ్ కేసులు
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ కేసుల ఉధృతి కొనసాగుతోంది. గత 24 గంటల్లో 26,126 మందికి కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 459 మందికి కరోనా సోకినట్లు తేలింది. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంగళవారం విడుదల చేసిన బులిటెన్లో పేర్కొంది.
కరోనా బారి నుంచి 247 మంది కోలుకున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం 4172 యాక్టివ్ కేసులు ఉన్నాయని తెలిపింది. అత్యధికంగా హైదరాబాద్ నగరంలో 232 కేసులు వెలుగుచూడగా, రంగారెడ్డి జిల్లాలో 60, సంగారెడ్డిలో 54, మేడ్చల్ మల్కాజిగిరిలో 28, ములుగులో 16, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 9 కేసులు నమోదయ్యాయి. రికవరీ రేటు 98.96 శాతంగా ఉంది.
దేశంలో తగ్గిన కొత్త కరోనా కేసులు
గత 24 గంటల్లో దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. సోమవారం ఉదయం నుంచి మంగళవారం ఉదయం వరకు 11,793 మంది వైరస్ బారినపడ్డారు. కరోనా బారినపడి మరో 27 మంది ప్రాణాలు కోల్పోయారు. కరోనా బారి నుంచి 9,486 మంది కోలుకున్నారు. దీంతో మొత్తం కోలుకున్నవారి సంఖ్య 98.57 శాతానికి చేరింది. మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసుల సంఖ్య 0.22 శాతం వద్ద ఉంది.
ఇప్పటి వరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 43,418,839కు చేరుకోగా, మొత్తం మరణాల సంఖ్య 5,25,047కు చేరింది. దేశంలో ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 96,700కు చేరుకుంది. దేశంలో సోమవారం 19,21,811 మందికి కరోనా టీకాలు అందించగా.. ఇప్పటివరకు పంపిణీ చేసిన వ్యాక్సిన్ డోసుల సంఖ్య 1,97,31,43,196కు చేరింది.