22 ని.ల్లో సినీ ఫక్కీలో భారీగా బంగారం దోపిడీ, వారంలో అరెస్ట్ చేసిన పోలీసులు
భాగ్యనగరంలో వారం రోజుల క్రితం జరిగిన భారీ దోపిడీకి పాల్పడిన ఆరుగురు దొంగలను పోలీసులు లాతూర్లో పట్టుకున్నారు.
హైదరాబాద్: భాగ్యనగరంలో వారం రోజుల క్రితం జరిగిన భారీ దోపిడీకి పాల్పడిన ఆరుగురు దొంగలను పోలీసులు లాతూర్లో పట్టుకున్నారు. కొత్త ఏడాదికి మూడు రోజుల ముందు బీరంగూడలోని ముత్తూట్ ఫైనాన్స్లో కేవలం 22 నిమిషాల్లో దొంగలు దోచుకెళ్లారు.
పక్కా సినీ ఫక్కీలో..: ముత్తూట్ ఫైనాన్స్ దోపిడీ ఇలా, ఈ వేషాలతో వచ్చారు..
ఈ కేసును పోలీసులు వారం రోజుల్లోనే ఛేదించడం గమనార్హం. ఈ కేసులో నిందితులను ఈ రోజు (బుధవారం) అరెస్టు చేశారు. నిందితులు ముంబై పారిపోతుండగా, వారిని వెంటాడిన సైబరాబాద్ పోలీసులు లాతూర్ ప్రాంతంలో అదుపులోకి తీసుకున్నారు.
వీరిని గురువారం ఉదయం హైదరాబాద్కు తీసుకు రానున్నారని తెలుస్తోంది. ఏపీ 28 ఎన్ 3107 నంబరున్న వాహనంలో పారిపోతున్నారని మినహా మరేమీ క్లూ లేకపోయినప్పటికీ, పోలీసులు ఈ నిందితులను పట్టుకున్నారు.
కాగా, రామచంద్రాపురం బీరంగూడలోని ముత్తూట్ ఫైనాన్స్ కార్యాలయంలో గతవారంలో సినీ ఫక్కీలో దోపిడీ జరిపి, కేవలం 22 నిమిషాల్లోనే రూ.13 కోట్ల విలువైన 46 కిలోల బంగారాన్ని ఆరుగురు దుండగులు దోచుకెళ్లిన విషయం తెలిసిందే.