తెలంగాణలో తగ్గుముఖం పట్టిన కరోనా పాజిటివ్ కేసులు: 31 మరణాలు
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా నమోదైన కరోనా కేసుల సంఖ్య స్వల్పంగా తగ్గింది. గత 24 గంటల్లో రాష్ట్రంలో 4723 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 5,11,711కు చేరింది. ఈ మేరకు బుధవారం సాయంత్రం రాష్ట్ర వైద్యారోగ్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.
జీహెచ్ఎంసీ పరిధిలో కొత్తగా 745 కరోనా కేసులు నమోదయ్యాయి. తాజాగా, కరోనా బారినపడి 31 మంది మరణించారు. దీంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో కరోనాతో మరణించినవారి సంఖ్య 2834కు చేరింది. ఇప్పటి వరకూ 4,49,744 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 59,133 యాక్టివ్ కేసులున్నాయి.
మరోవైపు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విధించిన లాక్డౌన్ బుధవారం ఉదయం 10 గంటల నుంచి అమల్లోకి వచ్చిన విషయం విదితమే. కరోనా కట్టడి కోసం విధించిన లాక్డౌన్కు తెలంగాణ ప్రజలు పూర్తిగా సహకరిస్తున్నారు. ఈ క్రమంలో కరోనా పరిస్థితులపై చర్చించేందుకు మంత్రి కేటీఆర్ అధ్యక్షతన కరోనా టాస్క్ఫోర్స్ కమిటీ తాత్కాలిక సచివాలయ భవనంలోని సీఎస్ కార్యాలయంలో సమావేశమైంది.
ప్రతిరోజు మందులు, వ్యాక్సిన్లను వేగవంతంగా సమకూర్చి, సరఫరా చేయడం కోసం మంత్రి కేటీఆర్ అధ్యక్షతన రాష్ట్రస్థాయి టాస్క్ ఫోర్స్ నియామకానికి క్యాబినెట్ మంగళవారం ఆమోదం తెలిపింది. పరిశ్రమలశాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్, జీఏడీ ప్రిన్సిపల్ సెక్రటరీ వికాస్ రాజ్, పంచాయతీరాజ్ ముఖ్య కార్యదర్శి సందీప్ సుల్తానియా, సీఎంఓ నుండి సీఎం కార్యదర్శి, కోవిడ్ ప్రత్యేకాధికారి రాజశేఖర్ రెడ్డి ఈ టాస్క్ ఫోర్స్ లో సభ్యులుగా కొనసాగుతున్నారు.
కాగా, హైదరాబాద్ నగరంలో కరోనా అదుపులోనే ఉందని సిటీ పోలీసు కమిషనర్ అంజనీ కుమార్ తెలిపారు. బుధవారం ఉదయం చార్మినార్ ప్రాంతంలో పర్యటించిన అంజనీ కుమార్.. లాక్డౌన్ అమలును పరిశీలించారు. ఈ సందర్భంగా సీపీ అంజనీ కుమార్ మాట్లాడుతూ.. ఢిల్లీ, ముంబై, బెంగళూరు నగరాలతో పోల్చుకుంటే కరోనా కట్టడిలో హైదరాబాద్ బెటర్ అని అన్నారు.
హైదరాబాద్లో కేసుల తీవ్రత తక్కువగా ఉందని, మరణాల రేటు కూడా అత్యల్పంగా ఉందని సీపీ స్పష్టం చేశారు. కరోనా కట్టడి కోసం విధించిన లాక్డౌన్కు నగర ప్రజలు సహకరించాలని సీపీ విజ్ఞప్తి చేశారు. అత్యవసర సేవలకు మినహాయింపు ఇచ్చామని, అనవసరంగా బయటకు వస్తే కఠిన చర్యలు తీసుకుంటామని సీపీ అంజనీ కుమార్ స్పష్టం చేశారు. కాగా, నేటి నుంచి పది రోజులపాటు రాష్ట్రంలో సంపూర్ణ లాక్డౌన్ అమలులో ఉండనుంది.