4940 ప్రత్యేక బస్సులు, 10 నుంచి 13వ తేదీ వరకు, అడ్వాన్స్ రిజర్వేషన్ కూడా..
సంక్రాంతి పండగ వస్తోంది. మరో 18 రోజుల్లో తెలుగు లోగిళ్లలో పండగ శోభ కనువిందు చేయనుంది. ఆంధ్రాలో అయితే వారం ముందునుంచే పండగ వాతావరణం నెలకొంటుంది. ఇక తెలంగాణలో కూడా పండగ శోభ మూడురోజుల పాటు ఉంటోంది. పండగ సందర్భంగా ఊర్లకు వెళ్లేవారి కోసం ప్రభుత్వం కూడా చర్యలు తీసుకుంటుంది. రైల్వేశాఖ ప్రత్యేక రైళ్లు నడుపుతుండగా.. ఆర్టీసీ స్పెషల్ బస్సులను కూడా నడిపిస్తామని ప్రకటించింది.
సంక్రాంతి పండగకు ఆయా రూట్లలో 4940 ప్రత్యేక బస్సులను నడిపిస్తామని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) ప్రకటించింది. సంక్రాంతి పండగకు నాలుగు రోజుల ముందు నుంచి బస్సులు అందుబాటులో ఉంటాయని పేర్కొన్నది. జనవరి 10వ తేదీ నుంచి 13వ తేదీ వరకు ప్రత్యేక బస్సులు నడుస్తాయని వెల్లడించింది. గురువారం మహాత్మాగాంధీ బస్ స్టేషన్లో స్పెషల్ బస్సుల వివరాలను అధికారులు వివరాలను తెలియజేశారు.
హైదరాబాద్ నుంచి జిల్లాలకు వెళ్లేవారి కోసం ఏర్పాట్లు చేసినట్టు పేర్కొన్నారు. వరంగల్ వైపు వెళ్లే వారు ఉప్పల్ వెళ్లాలని, కరీంనగర్ వారు జేబీఎస్ నుంచి వెళ్లాలని సూచించారు. దీంతో రద్దీ తగ్గుతుందని, పండగ సమయాల్లో ట్రాఫిక్ను ఈ విధంగా కంట్రోల్ చేస్తామని పేర్కొన్నారు. ప్రత్యేక బస్సుల్లో వెళ్లేవారు రిజర్వేషన్ చేసుకునే సదుపాయం కూడా కల్పించినట్టు వివరించారు.