తూగో తాపేశ్వరం నుంచి.. ఖైరతాబాద్ గణేషుడికి 5,600 కిలోల లడ్డూ
హైదరాబాద్: ఖైరతాబాద్ వినాయకుడికి ఈ ఏడాది 5,600 కిలోల లడ్డూను సమర్పించనున్నట్లు తూర్పు గోదావరి జిల్లా తాపేశ్వరానికి చెందిన సురుచి ఫుడ్స్ సంస్థ అధినేత పోలిశెట్టి మల్లిబాబు సోమవారం నాడు తెలిపారు.
ఈ భారీ లడ్డూని ఉచితంగా అందజేయనున్నారు. ఆయన మాట్లాడుతూ.. 2010లో తొలిసారిగా 500 కిలోల లడ్డూను ఖైరతాబాద్ వినాయకునికి నైవేద్యంగా సమర్పించామన్నారు. 2011లో 2,400 కిలోలు, 2012లో 3,500, 2013లో 4,200, 2014లో 5,200 కిలోల లడ్డూను ప్రసాదంగా సమర్పించామన్నారు.
కుటుంబ సభ్యులు, సిబ్బంది సహాయ సహకారాలతో ఈసారి 5,600 కిలోల లడ్డూను సమర్పిస్తున్నామని చెప్పారు. ఏడు అడుగుల వ్యాసంతో ఉండే ఈ లడ్డూ తయారీకి శ్రీకారం చుట్టామన్నారు. సెప్టెంబర్ 9న లడ్డూ తయారీకి సంబంధించి తమ సంస్థ ఆవరణలోనే ప్రత్యేక ప్రాంగణానికి రూపకల్పన చేస్తామని చెప్పారు.
సెప్టెంబర్ 9న మాలధారణ చేసి లడ్డూ తయారీని లాంఛనంగా ప్రారంభిస్తామన్నారు. వినాయకుని చేతిలో పెన్ను, చేత్తో పుస్తకం, విద్యాగణపతి కిరీటంపై లక్ష్మీదేవి, సరస్వతి, పార్వతి అమ్మవార్ల ప్రతిమలను జీడిపప్పు మిశ్రమంతో తయారు చేస్తారు.
12న లడ్డూ తయారీ ప్రారంభమై, 14న పూర్తవుతుందన్నారు. 15న లడ్డూను అలంకరించి, 16న భారీ ఊరేగింపుతో ఖైరతాబాద్ తరలిస్తామన్నారు. 17న వినాయకునికి నైవేద్యంగా సమర్పిస్తామన్నారు.
కాగా, ఈ లడ్డూలో జీడిపప్పు 380 కిలోలు, బాదంపప్పు 100 కిలోలు, పచ్చ కర్పూరం 11కిలోలు, యాలకులు 33 కిలోలు, సెనగపప్పు 1505 కిలోలు, నెయ్యి 1100 కిలోలు, పంచదార 2,425 కిలోలు. 16 మంది గణేష్ మాలధారణలో ఉండి పవిత్రంగా లడ్డూ తయారీలో పాల్గొంటారు.