కరోనా: కర్ఫ్యూ పట్టని పేపర్ ప్లేట్ ఫ్యాక్టరీ, యథేచ్చగా పని, మైనర్లతో గొడ్డు చాకిరీ.. రైడ్...
కరోనా వైరస్తో పాజిటివ్ కేసులు పెరుగుతోన్న నేపథ్యంలో ఆందోళన నెలకొంది. తెలంగాణలో ఏప్రిల్ 14 వరకు లాక్ డౌన్ ఉండగా.. రాత్రి 7 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు కర్ప్యూ అమల్లో ఉంది. కానీ కొన్ని సంస్ధలు మాత్రం యధేచ్చగా నడస్తున్నట్టు తెలుస్తోంది. సీఎం కేసీఆర్ మాటలను లెక్కచేయడం లేదని తెలుస్తోంది. వికారాబాద్ జిల్లాలో జరిగిన ఘటనే ఇందుకు అద్దంపడుతోంది.
వికారాబాద్ జిల్లా శివారెడ్డిపేటలో గల సంగమేశ్వర ఎంటర్ ప్రైజెస్ పేరుతో పేపర్ ప్లేట్ ఉత్పత్తి చేసే ఫ్యాక్టరీ ఉంది. వాస్తవానికి లాక్ డౌన్ సందర్భంగా దీనిని కూడా మూసివేయాలి. కానీ తమకు నిబంధనలు పట్టవేమో అన్నట్టు నడిపిస్తున్నారు.. అదీ కూడా మైనర్లతో పనిచేయించుకుంటున్నారు. విషయం తెలిసిన స్వచ్చంద సంస్థ.. పోలీసులు, రెవెన్యూ సిబ్బంది, చైల్డ్ ప్రొటెక్షన్ అధికారులకు సమాచారం అందజేశారు.
ఎన్జీవో సంస్థ ప్రతినిధులు కరోనా వైరస్ గురించి అవగాహన కల్పించే సమయంలో పనిచేస్తున్నారని తెలిసి.. అధికారులకు సమాచారం అందజేశారు. తాము ఫ్యాక్టరీ వద్దకు వచ్చినప్పుడు గేట్లు క్లోజ్ చేసి.. లోపల పనిచేస్తున్నారని ఎన్జీవో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కే కృష్ణన్ పేర్కొన్నారు. తెరచి చూడగా ఐదుగురు ఉన్నారని.. వారంతా 11 నుంచి 15 ఏళ్ల వయస్సున్న మైనర్లు అని తెలిపారు. వీరు బీహర్కు చెందిన వలసకూలీలని చెప్పారు. ఏడాది క్రితం వారిని ఇక్కడకు తీసుకొచ్చి.. గొడ్డు చాకిరీ చేయించుకుంటున్నారని తెలిపారు. యాజమాన్యంపై కార్మిక చట్టం, జువైనల్ యాక్ట్ కింద కేసు నమోదు చేసినట్టు వివరించారు.
వికారాబాద్లో తాజాగా బాలలతో గొడ్డు చాకిరీ వెలుగులోకి రాగా.. ఇటీవల కరీంనగర్లో 24 మంది వలసకూలీలను అదుపులోకి తీసుకున్నారు. వీరంతా ఒడిశాకు చెందిన వారు అని అధికారులు తెలిపారు. ఇందులో ఆరుగురు చిన్నారులు ఉండగా.. తొమ్మిది మంది మహిళలు ఉన్నారు.