ముత్తూట్లో భారీ చోరీ, ఐఐఎఫ్ఎల్లో గోల్డ్ మాయం
హైదరాబాద్/మెదక్: తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాదులో ఐఐఎఫ్ఎల్ బంగారు రుణాల సంస్థలో, మెదక్ జిల్లాలోని ముత్తూట్ ఫైనాన్స్లో దొంగతనం జరిగింది! మెదక్ జిల్లాలో దోపిడీ జరగగా, వనస్థలిపురంలో ఉద్యోగులు చేతివాటం ప్రదర్శించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
మెదక్ జిల్లా రామచంద్రాపురం అశోక్ నగర్లోని ముత్తూట్ ఫైనాన్స్ కార్యాలయంలో బుధవారం ఉదయం భారీ దోపిడీ జరిగింది. సిబ్బందిని బెదిరించిన దుండగులు బంగారం, నగదును అపహరించారు. సమాచారం అందుకున్న పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు.
నిందితులు కస్టమర్లలా వచ్చారు. వారు సిబ్బందిని బెదిరించి లాకర్ రూంలో బంధించారు. అనంతరం కార్యాలయంలోని ఐదు కిలోల బంగారంతో పాటు తమను ఎవరు గుర్తు పట్టకుండా ఉండేందుకు సీసీ కెమెరా హార్డ్ డిస్క్ను ఎత్తుకు వెళ్లారు.
మరోవైపు, హైదరాబాదులోని వనస్థలిపురంలో ఐఐఎఫ్ఎల్లో సిబ్బంది చేతివాటం చూపించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. 217 మంది వినియోగదారులు బంగారం దాచుకున్నారు. అంతమంది దాచినప్పటికీ మిగిలింది మాత్రం 28 వస్తువులే.
కార్యాలయంలో సీసీ కెమెరాలు లేకపోవడంతో నిందితులు ఎవరనేది గుర్తించడం కష్టతరంగా మారినట్లుగా తెలుస్తోంది. కస్టమర్లు తాకట్టు పెట్టిన బంగారం విలువ రూ.25 లక్షలకు పైగా ఉంటుందని తెలుస్తోంది.
స్వైన్ఫ్లూతో ఎనిమిది నెలల బాలుడు మృతి
గాంధీ ఆస్పత్రిలో స్వైన్ఫ్లూతో ఎనిమిది నెలల బాలుడు మృతి చెందాడు. తొమ్మిది మంది సహా 36 మందికి స్వైన్ఫ్లూ ఉన్నట్లుగా గుర్తించారు. ఆసుపత్రిలో 63 మంది స్వైన్ఫ్లూ అనుమానితులు చికిత్స పొందుతున్నారు. కాగా, మృతి చెందిన బాలుడు కరీంనగర్ జిల్లాకు చెందిన వ్యక్తి.