కారు-ఆటో ఢీ, 6గురు మృతి, పరామర్శించేందుకు వెళ్లిన మంత్రికి చేదు అనుభవం
హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా మంచాల మండలం లింగంపల్లి వద్ద ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఆటో, కారు ఢీకొనడంతో ఐదుగురు మృతి చెందారు. మరో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉంది. దీంతో మృతుల కుటుంబాలకు న్యాయం చేయాలని స్థానిక నేతలు, గ్రామస్తులు రోడ్డు పైన బైఠాయించారు. మద్యం మత్తులో యాక్సిడెంట్ జరిగిందని వారు ఆరోపించారు.
మంచాల మండలం లింగాల వద్ద ఆటోను కారు ఢీకొన్న ఘటనలో ఆటో డ్రైవర్తో పాటు నలుగురు మహిళలు మృతిచెందారు. చెన్నారెడ్డిగూడకు చెందిన 10 మంది మహిళలు కూరగాయలను మార్కెట్కు తరలించే నిమిత్తం ఆటోలో హైదరాబాద్ బయలుదేరారు. వారి ఆటో లింగాల వద్దకు చేరుకోగానే ఎదురుగా వేగంగా వచ్చిన కారు ఢీకొంది. దీంతో ఆటో డ్రైవర్ శ్రీను, సుజాత, మాధవి, మారు, అఫిలి అక్కడికక్కడే మృతి చెందారు. మరో 10 మంది గాయపడ్డారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉంది.
క్షతగాత్రులను హుటాహుటిన ఇబ్రహీంపట్నం, హైదరాబాద్ ఆసుపత్రులకు తరలించారు. ప్రమాదం సమాచారం తెలుసుకున్న బాధితుల కుటుంబ సభ్యులు, బంధువుల అక్కడికి చేరుకుని కన్నీరుమున్నీరయ్యారు. కారు అతివేగంగా వచ్చి ఢీకొనడంతో వల్లనే ఈ ప్రమాదం జరిగిందని చెబుతున్నారు.
కాగా, బాధితులను పరామర్శించేందుకు మంత్రి మహేందర్ రెడ్డి వెళ్లారు. ఆయనకు చేదు అనుభవం ఎదురైంది. మంత్రి కాన్వాయ్ పైన ఆందోళనకారులు రాళ్లు విసిరారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు పలువురి అదుపులోకి తీసుకున్నారు. అందులో కొందరిని వదిలేసి, మరికొందరిని విడుదల చేశారు.
అయితే, తాను రవాణా శాఖ మంత్రిగా ఉన్నానని, ఆపద్భాందు పథకం కింద రూ.3 లక్షల రూపాయలు ఇప్పిస్తానని హామీ ఇచ్చారు. అలాగే ముఖ్యమంత్రితో మాట్లాడి మృతుల కుటుంబాలకు సహాయం చేస్తానని చెప్పారు. ప్రమాదంపై ఆయన దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
తెలుగు రాష్ట్రాల్లో వరుస ప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ రెండు రోజుల్లోనే రెండు తెలుగు రాష్ట్రాల్లో నలభై మంది వరకు మృత్యువాత పడ్డారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో ఆదివారం ట్రాక్టర్ బోల్తా పడి 15 మంది మృతి చెందగా, ఏపీలోనూ పలు ప్రమాదాల్లో కొందరు మృతి చెందారు. సోమవారం రంగారెడ్డి జిల్లాలో ప్రమాదం చోటు చేసుకుంది.
చిన్నారి మృతి
రంగారెడ్డి జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. షాబాద్ మండలం గోపిగడ్డలో సంవత్సరంన్నర చిన్నారి ఆద్య పాఠశాల బస్సు కింద పడి మృతి చెందింది. తన అన్నను పాఠశాల బస్సు ఎక్కించేందుకు తండ్రిలో కలిసి బయటకు వచ్చిన ఆద్య అక్కడే ఆడుకుంటూ బస్సు కిందకు వెళ్లింది. పాపను గుర్తించని డ్రైవర్ బస్సును ముందుకు నడపడంతో చక్రాల కింద నలిగి ప్రాణాలు కోల్పోయింది.