అక్రమ చొరబాట్లు: రోహింగ్యాల అరెస్ట్, వారికి ఆధార్, పాస్ పోర్ట్కూడా
హైదరాబాద్: అక్రమంగా దేశంలోకి చొరబడిన ముగ్గురు మహిళలతోపాటు ఐదుగురు రోహింగ్యాలను పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. వారు అక్రమంగా చొరబడటంతోపాటు తప్పుడు వివరాలతో ఆధార్ కార్డు, పాస్ పోర్టు కూడా సంపాదించారని పోలీసులు తెలిపారు.
పక్కా సమాచారంతో సంగారెడ్డి జిల్లాలోని జహీరాబాద్లో సోదాలు నిర్వహించిన పోలీసులు.. 25-45ఏళ్ల మధ్య వయస్సున్న ఐదుగురు రోహింగ్యాలను పోలీసులు అరెస్ట్ చేశారు. తాము భారతీయులమని చెప్పి, తప్పుడు సమాచారంతో పొందిన ఐదు ఆధార్ కార్డులు, రెండు భారత పాస్పోర్టులు పోలీసులు సీజ్ చేశారు.
ఈ రోహింగ్యాలు కొన్ని సంవత్సరాల క్రితమే భారతదేశంలోకి చొరబడ్డారు. బంగ్లాదేశ్ నుంచి మయన్మార్ ద్వారా కోల్కతాలోకి ఆ తర్వాత ఢిల్లీకి, అక్కడ్నుంచి హైదరాబాద్ వచ్చి జహీరాబాద్లో స్థిరపడ్డట్లు పోలీసులు తెలిపారు. ఇక్కడే పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారని చెప్పారు. ట
ఆ ఐదుగురికీ ఆధార్ కార్డులున్నాయని, వారిలో ఇద్దరికి ఇండియన్ పాస్ పోర్టు కూడా ఉందని పోలీసులు తెలిపారు. ఐపీసీ సెక్షన్ 420 తోపాటు పాస్ పోర్ట్ యాక్ట్ కింద కేసులు నమోదు చేసినట్లు చెప్పారు. ఈ ఐదుగురిని కోర్టులో ప్రవేశపెట్టగా.. వీరికి జుడీషియల్ కస్టడీ విధించిందని పోలీసులు తెలిపారు.