తెలంగాణలో మరో భారీ ఎన్కౌంటర్: వికారుద్దీన్, 4గురు సిమి టెర్రరిస్ట్స్ మృతి
వరంగల్: తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్ - నల్గొండ జిల్లా సరిహద్దులో మంగళవారం మరో భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఉగ్రవాది వికారుద్దీన్ను తీసుకు వస్తుండగా ఎస్కార్ట్ వాహనం పైన సిమి ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. పోలీసులు ఎదురు కాల్పులు జరిపారు. దీంతో ఐదుగురు సిమి ఉగ్రవాదులు మృతి చెందారు.
వికారుద్దీన్ను హైదరాబాదుకు తీసుకు వస్తుండగా ఈ ఎదురు కాల్పులు జరిగాయి. సిమి కార్యకర్తలుగా భావిస్తున్న వారు ఎస్కార్ట్ వాహనంపై కాల్పులు జరపడంతో అప్రమత్తమైన పోలీసులు ఎన్కౌంటర్ చేశారు. ఈ ఘటనలో వికారుద్దీన్ సహా మిగిలిన కాల్పులు జరిపిన నలుగురు కూడా మృతి చెందారు.
ఈ ఎదురు కాల్పులు ఆలేరు (నల్గొంజ జిల్లా) - జనగామ (వరంగల్ జిల్లా) మధ్య జరిగింది. వికారుద్దిన్కు పలు ఉగ్రవాద కార్యకలాపాలతో సంబంధం ఉంది. వికారుద్దీన్కు ఐఎస్ఐతో సంబంధాలు ఉన్నాయి.
వికారుద్దీన్కు ఉగ్రవాద కార్యకలాపాలు, పలు పేలుళ్ల కేసులతో సంబంధాలు ఉన్నాయి. మూడేళ్ల క్రితం హైదరాబాదులో ఆరుగురు పోలీసులను హతమార్చాడు. గుజరాత్ హోంమంత్రిపై దాడి కేసులో వికారుద్దీన్ నిందితుడు.
శాలిబండ, సంతోష్ నగర్ తదితర పోలీసు స్టేషన్లలో దాడి, దేశద్రోహం కేసులు నమోదయ్యాయి. గతంలో వికారుద్దీన్ను అరెస్టు చేసిన సమయంలో భారీగా ఆయుధాలు పట్టుపడ్డాయి. జైలులో ఉన్న సమయంలో తనకు బిర్యానీ కావాలని జైలు అధికారులను డిమాండ్ చేసిన సందర్భాలు ఉన్నాయి.
జనగామ - ఆలేరు ఎన్కౌంటర్లో మృతి చెందిన ఉగ్రవాదులు వీరే..
జనగామ - ఆలేరు ఎన్కౌంటర్లో ఐదుగురు ఉగ్రవాదులు మృతి చెందారు. అందులో వికారుద్దీన్ కీలకమైన వ్యక్తి. మిగతా నలుగిరిలో... సయ్యద్ అంజద్, హనీఫ్, జకీర్, ఇర్ఫాన్లు ఉన్నారు. కాగా, వీరు సిమి, డీజేఎస్లలో పని చేశారు. ఇప్పుడు తెహ్రీక్ గలాబా ఈ ఇస్లామ్గా పని చేస్తున్నారు.
కక్ష కట్టి చంపేశారు: తండ్రి
తమ కుమారుడు వికారుద్దీన్ను పోలీసులు కక్ష కట్టి ఎన్కౌంటర్ చేశారని సదరు ఉగ్రవాది తండ్రి మహ్మద్ ఆరోపించారు. 90 శాతం కేసు విచారణ పూర్తయినా అన్యాయంగా పొట్టన పెట్టుకున్నారన్నారు. వికారుద్దీన్ ఎన్కౌంటర్ నేపథ్యంలో హైఅలర్ట్ ప్రకటించారు. రంగంలోకి దిగిన ప్రత్యేక పోలీసు బృందాలు పలు ప్రాంతాల్లో ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టాయి. ఎక్కడికి అక్కడ వాహనాలను తనిఖీ చేస్తున్నారు.