ఆంత్రాక్స్ తో 50 గొర్రెలు మృతి.. అప్రమత్తంగా లేకుంటే అంతే సంగతి
తెలంగాణా రాష్ట్రంలో మళ్లీ ఆంత్రాక్స్ భయం పట్టుకుంది. గొర్రెలకు అరుదుగా సోకే ఆంత్రాక్స్ వ్యాధి సోకి 50 గొర్రెల మృతి చెందాయి. దీంతో అప్రమత్తమైన పశుసంవర్ధక శాఖ అధికారులు ఈ వ్యాధి ప్రబలకుండా తగిన చర్యలు తీసుకుంటున్నారు. ఈ వ్యాధి సోకిన గొర్రెలను తింటే మనుషులకు సైతం ఈ వ్యాధి సోకే అవకాశం ఉంది కాబట్టి అటు పశువైద్యాధికారులు అప్రమత్తమయ్యారు.
సూర్యాపేట జిల్లాలో ఆంత్రాక్స్ తో 50 గొర్రెలు మృతి
ఆంత్రాక్స్... ఈ పేరు చెప్తేనే ప్రజలు బెంబేలెత్తిపోతారు. భయాందోళనకు గురవుతారు. గొర్రెలకు సోకే ఈ వ్యాధి, గొర్రెల నుండి, పశువుల నుండి మనుషులకు కూడా సంక్రమిస్తుందని తెలుస్తోంది. కాబట్టి పశువులకు ఈ వ్యాధి రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అయితే సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు లో ఆంత్రాక్స్ బారినపడిన 50 గొర్రెలు మృత్యువాత పడ్డాయి. ఇవి చనిపోవడానికి ఆంత్రాక్స్ కారణమని అటు అధికారులు సైతం ప్రాథమిక అంచనాకు వచ్చారు. ఆంత్రాక్స్ తో మృతి చెందిన గొర్రెలను కోయకూడదు..
పశుసంవర్ధక శాఖ
గొర్రెలకు సంబంధించిన రక్త నమూనాలను పరీక్షల నిమిత్తం ల్యాబ్ కు పంపించారు. ఆంత్రాక్స్ తో గొర్రెలు చనిపోవడంతో మిగిలిన గొర్రెలకు సోకకుండా వ్యాక్సినేషన్ చేసి తగు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఆంత్రాక్స్ వ్యాధి వచ్చిన గొర్రెల నుండి బ్యాక్టీరియా మూడు కిలోమీటర్ల మేర ప్రభావాన్ని చూపిస్తుందని, ఆ పరిధిలో ఉన్న ఇతర గొర్రెలకు సైతం ఇది సోకే అవకాశం ఉందని తెలిపారు. అందుకే ఆంత్రాక్స్ తో చనిపోయిన గొర్రెలను 6 అడుగుల లోతు గొయ్యి తీసి, ఎక్కువ మొత్తంలో సున్నం వేసి పార్టీ పెట్టాలని సూచించారు. పొరపాటున కూడా ఆంత్రాక్స్ సోకిన గొర్రెలను కోయకూడదని దీనితో అటు పశువుల కే కాకుండా, ఆ గొర్రెల మాంసం తిన్న మనుషులకు సైతం ఆంత్రాక్స్ వచ్చే ప్రమాదముందని పశు వైద్య అధికారులు చెప్పారు.
ఆంత్రాక్స్ లక్షణాలు... జాగ్రత్తగా ఉండాలంటున్న వైద్యులు
గొర్రెల పెంపకం చేస్తున్న వారంతా గొర్రెల చెవులు, ముక్కు, విసర్జక వ్యవస్థ నుండి రక్తం కారుతున్నా , పొట్ట ఉబ్బినట్టుగా కనిపిస్తున్నా , కారిన రక్తం గడ్డ కట్టకుండా ఉన్నా అదే ఆంత్రాక్స్ గా గుర్తించాలని సూచిస్తున్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే అటు పశువుల ప్రాణాలతో పాటు ఇటు మనుషుల ప్రాణాలకు సైతం చేటు చేసిన వారవుతారని వైద్యులు అంటున్నారు. అందుకే ఆంత్రాక్స్ డేంజర్ బెల్స్ మోగించక ముందే తస్మాత్ జాగ్రత్త.