తెలంగాణలో కరోనా పంజా: 51 పాజిటివ్ కేసులు, 21 మంది డిశ్చార్జ్
తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ కేసులు పెరుగుతున్నాయి. శనివారం నుంచి పాజిటివ్ కేసులు సంఖ్య డబుల్ డిజిట్గా నమోదవుతోంది. శనివారం 31, ఆదివారం 33 కాగా.. సోమవారం రికార్డు స్థాయిలో 79 పాజిటివ్ కేసులు గుర్తించారు. మంగళవారం కూడా అదే ఒరవడి కొనసాగింది. 51 మందికి వైరస్ సోకిందని అధికారులు తెలిపారు. అయితే వీరిలో 37 మంది జీహెచ్ఎంసీ పరిధిలోనివి కాగా.. 14 మంది వలసకూలీలు అని అధికారులు పేర్కొన్నారు.
కరోనా ఎఫెక్ట్: ఒక్క అడుగుకే పరిమితం కానున్న ఖైరతాబాద్ వినాయకుడు...? వైరస్ తగ్గితే..?
51 పాజిటివ్ కేసులతో వైరస్ సోకిన వారి సంఖ్య 1326కి చేరింది. 822 మందికి వ్యాధి తగ్గడంతో డిశ్చార్జ్ చేశారు. ఇవాళ 21 మందిని ఇంటికి పంపించారు. వీరిలో హైదరాబాద్ 13, సూర్యాపేట 3, మేడ్చల్ 1, రంగారెడ్డి 3, వరంగల్ నుంచి ఒకరు ఉన్నారు. మంగళవారం వైరస్ వల్ల ఇద్దరు చనిపోయారు. దీంతో మృతుల సంఖ్య 32కి చేరింది. ప్రస్తుతం 472 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
ఇప్పటివరకు వరంగల్ రూరల్, యాదాద్రి, వనపర్తిలో ఒక్క పాజిటివ్ కేసు నమోదు కాలేదు. గత 14 రోజుల నుంచి కరీంనగర్, సిరిసిల్లా, కామారెడ్డి, మహబూబ్ నగర్, మెదక్, భూపాలపల్లి, సంగారెడ్డి, నాగర్ కర్నూలు, ములుగు, పెద్దపల్లి, సిద్దిపేట, మహబూబాబాద్, మంచిర్యాల, భద్రాద్రి, వికారాబాద్, నల్గొండ, ఆసిఫాబాద్, ఖమ్మం, నిజామాబాద్, ఆదిలాబాద్, సూర్యాపేట, నారాయణ్ పేట్, వరంగల్ అర్బన్, జనగామ, గద్వాల, నిర్మల్ జిల్లాలో ఒక్క పాజిటివ్ కేసు నమోదు కాలేదు.