తెలంగాణలో మరోసారి భారీగా పెరిగిన కరోనా కేసులు: హైదరాబాద్లోనే అత్యధికం
హైదరాబాద్: తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతూనే ఉంది. శనివారం కొత్తగా 55 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడంతో మొత్తం కేసుల సంఖ్య 1509కి చేరిందని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. నమోదైన కేసుల్లో అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలోనే 44 కేసులు ఉండటం గమనార్హం.
కరోనా కేసులు ఇలా
సంగారెడ్డి జిల్లాలో 2, రంగారెడ్డిలో 1, మరో 8 మంది వలస కార్మికులకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయినట్లు ఆరోగ్యశాఖ తెలిపింది. తాజా కేసులతో కలిపి ఇప్పటి వరకు 52 మంది వలస కార్మికులు కరోనా బారినపడినట్లు వెల్లడించింది. మొత్తం 1509 కేసుల్లో 971 మంది బాధితులు డిశ్చార్జ్ అయ్యారు. మరో 504 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 34 మంది ప్రాణాలు కోల్పోయారు.
ఈ జిల్లాల్లో ఒక్క కరోనా కేసూ లేదు..
యాదాద్రి భువనగిరి, వరంగల్ రూరల్, వనపర్తి జిల్లాల్లో ఇప్పటి వరకు ఒక్క కరోనా పాజిటివ్ కేసు నమోదు కాలేదని వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. గత 14 రోజులుగా రాష్ట్రంలోని కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, కామారెడ్డి, మహబూబ్ నగర్, మెదక్, జయశంకర్, భూపాలపల్లి, నాగర్ కర్నూల్, ములుగు, పెద్దపల్లి, సిద్దిపేట, మహబూబాబాద్, మంచిర్యాల, భద్రాద్రి కొత్తగూడెం, నారాయణపేట్, వికారాబాద్, నల్గొండ, కుమరంభీం అసిఫాబాద్, ఖమ్మం, నిజామాబాద్, ఆదిలాబాద్, సూర్యాపేట, వరంగల్ అర్బన్, జనగామ, జోగులాంబ గద్వాల, నిర్మల్ జిల్లాల్లో ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదని వైద్యారోగ్య శాఖ వెల్లడించింది.
ఒకే కుటుంబంతో కేసులు అధికం..
ఇది ఇలావుండగా, తెలంగాణలో కరోనావైరస్ వ్యాప్తి పూర్తి స్థాయిలో అదుపులో ఉంచేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ తెలిపారు. హైదరాబాద్లో యాక్టివ్ కేసులు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో విధులు నిర్వహిస్తున్న నోడల్ అధికారులు, డాక్టర్లతో మంత్రి మాట్లాడారు. ఒకే కుటుంబంలో ఎక్కువ కేసులు నమోదవుతుండటంతో రాష్ట్రంలో కూడా కేసులు పెరుగుతున్నాయన్నారు.
Recommended Video
ఐసీఎంఆర్ కీలక ఆదేశాల ప్రకారమే..
ఐసీఎంఆర్ మార్గదర్శకాల ప్రకారమే బాధితులకు చికిత్స అందిస్తున్నట్లు మంత్రి ఈటెల రాజేందర్ తెలిపారు. తాజాగా, పలు కీలక మార్గదర్శకాలు విడుదల చేసిందని, వాటి ప్రకారం డిశ్చార్జ్ పాలసీ, హోం ఐసోలేషన్, డెత్ గైడ్ లైన్స్ ను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయనుందని తెలిపారు. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ కొత్త మార్గదర్శకాల ప్రకారం కరోనా పాజిటివ్ వ్యక్తులను ఎటువంటి పరీక్షలు చేయకుండానే డిశ్చార్జ్ చేయవచ్చని పేర్కొంది. ఇలా డిశ్చార్జ్ అయిన వారిని మరో ఏడురోజులపాటు హోం ఐసోలేషన్లో ఉంచాలని తెలిపింది.ఒకవేళ లక్షణాలు ఎక్కువగా ఉన్నా, ఇతర సమస్యలతో బాధపడుతున్న పేషంట్లను మాత్రం ఆస్పత్రిలోనే ఉంచి చికిత్స అందించాలని ఐసీఎంఆర్ నిర్దేశించినట్లు మంత్రి తెలిపారు.