కోర్టు ధిక్కరణ కేసులకు రూ. 58 కోట్ల ప్రజల నిధులా?: తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు ప్రశ్నలు, నోటీసులు
హైదరాబాద్: కోర్టు ధిక్కరణ కేసుల ఖర్చులకు తెలంగాణ ప్రభుత్వం నిధులు మంజూరు చేయడంపై హైకోర్టు విస్మయం వ్యక్తం చేసింది. ఈ విషయంపై బుధవారం హైకోర్టు విచారణ చేపట్టింది. ఓ లెక్చరర్ దాఖలు చేసిన పిల్పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ మిమా కోహ్లీ, న్యాయమూర్తి జస్టిస్ విజయ్ సేన్ రెడ్డి ధర్మానం విచారణ చేసింది.
కోర్టు ధిక్కరణ కేసులకు రూ. 58 కోట్లు మంజూరు చేయడమేంటని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని ధర్మాసనం ప్రశ్నించింది. ప్రజాధనం ఎలా ఖర్చు చేస్తారో వివరించాలని, ట్రెజరీ నిబంధనలు ఎలా అనుమతిస్తాయో చెప్పాలని ఉన్నతన్యాయస్థానం ఆదేశించింది.
ఈ వ్యవహారంపై రెవెన్యూ, ఆర్థిక శాఖ కార్యదర్శులతోపాటు సీసీఎల్ఏ, ట్రెజరీ డైరెక్టర్లకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. సీఎస్ సోమేశ్ కుమార్కు వ్యక్తిగత హోదాలో నోటీసులు ఇచ్చింది. తదుపరి విచారణను అక్టోబర్ 27కి వాయిదా వేసింది.
ఇది ఇలావుండగా, కాకతీయ, తెలుగు యూనివర్సిటీ వీసీలకు తెలంగాణ హైకోర్టు బుధవారం నోటీసులు జారీ చేసింది. వీసీల నియామకంపై విశ్రాంత ప్రిన్సిపాల్ విద్యాసాగర్ దాఖలు చేసిన పిల్పై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టి హిమా కోహ్లీ, జస్టిస్ విజయ్ సేన్ రెడ్డి ధర్మాసనం విచారణ చేపట్టింది.
నిబంధనలకు విరుద్ధంగా కాకతీయ, తెలుగు యూనివర్సిటీల వీసీల నియామకం జరిగిందని, కేయూ వీసీకి పదేళ్ల అనుభవం లేదని పిటిషనర్ తరపు న్యాయవాది కోర్టుకు తెలియజేశారు. తెలుగు వర్సిటీ వీసీకి 70 ఏళ్లు దాటాయని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. పిటిషనర్ తరపు వాదనలు విన్న ధర్మాసనం.. దీనిపై వివరణ ఇవ్వాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి, యూజీసీని ఆదేశించింది.
Recommended Video
కాకతీయ యూనివర్సిటీ వీసీ రమేశ్, తెలుగు వర్సిటీ వీసీ కిషన్ రావుకు నోటీసులు జారీ చేసింది హైకోర్టు. నాలుగు వారాల్లోగా కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణను అక్టోబర్ 27కి వాయిదా వేసింది.