రక్తమోడిన చేవెళ్ల రోడ్డు: బోర్వెల్ వాహనాన్ని ఢీ కొట్టిన ఇన్నోవా: నుజ్జునుజ్జు: ఆరుమంది దుర్మరణం
హైదరాబాద్: రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఆరుమంది ప్రయాణికులు దుర్మరణం పాలయ్యారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డ వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. వారంతా సికిింద్రాబాద్లోని తాడ్బండ్ నివాసులు. మృతులు ఒకే కుటుంబానికి చెందిన వారిగా భావిస్తున్నారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలించారు.
బుధవారం తెల్లవారు జామున కందవాడ-మల్కాపూర్ మధ్య ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. మృతులను ఆసిఫ్, సానియా, నజియా బేగమ్, హర్ష, నజియా బాను, హర్షబానుగా గుర్తించారు. తాడ్బండ్ నుంచి ఈ తెల్లవారు జామున వారు ఇన్నోవా కారులో మహబూబ్ నగర్కు బయలుదేరారు. చేవెళ్ల, పరిగి మీదుగా మహబూబ్ నగర్కు చేరుకోవాల్సి ఉంది. హైదరాబాద్-విజయపుర రహదారి మీదుగా వారు మహబూబ్ నగర్కు బయలుదేరారు. వారు ప్రయాణిస్తోన్న కారు మార్గమధ్యలో కందవాడ దాటిన కొద్దిసేపటికే ప్రమాదానికి గురైంది. ఎదురుగా వస్తోన్న బోర్వెల్ వాహనాన్ని వేగంగా ఢీ కొట్టింది.
ఈ ఘటనలో ఆరుమంది అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఇన్నోవా ముందుభాగం మొత్తం నుజ్జునుజ్జయింది. ఇంజిన్ లోనికి చొచ్చుకుని వచ్చింది. మధ్యలో ఇరుక్కుని డ్రైవర్ అక్కడికక్కడే మరణించాడు. ఎయిర్ బెలూన్లు తెరచుకోకపోవడం వల్ల ప్రమాదం తీవ్రత పెరిగినట్లు పోలీసులు అంచనా వేస్తున్నారు. ఎయిర్ బెలూన్లు తెరచుకుని ఉంటే డ్రైవర్, ముందు సీట్లో కూర్చున్న వారు ప్రాణాలతో బయటపడటానికి అవకాశం ఉండేదని చెబుతున్నారు.
Recommended Video
సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. కారులో సీట్ల మధ్య ఇరుక్కున్న మృతదేహాలను వెలికి తీయడానికి శ్రమించాల్సి వచ్చింది. పోస్ట్మార్టమ్ కోసం తరలించారు. గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలించారు. కారులో ప్రయాణిస్తోన్న ఓ బాలుడికి ఎలాంటి గాయాలు కాలేదు. ప్రమాదం తాలూకు షాక్లో ఆ బాలుడు మునిగిపోయాడు. చాలాసేపటి వరకు తేరుకోలేకపోయాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు ప్రారంభించారు.