6 నిమిషాలేనా.. 19 మందిని లెక్క తీసుకోరా..? టీఆర్ఎస్ తీరుపై భట్టి గరం గరం..
అధికార టీఆర్ఎస్ పార్టీపై కాంగ్రెస్ మండిపడింది. అసెంబ్లీలో ప్రతిపక్షాల గొంతు నొక్కుతుందని ఆరోపించింది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి ఇచ్చిన సమయంపై సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మండిపడ్డారు. అసెంబ్లీ వాయిదా పడ్డ తర్వాత గన్ పార్క్ వద్ద ఎమ్మెల్యేలతో కలిసి భట్టి.. మీడియాతో మాట్లాడారు.
అసెంబ్లీలో తమకు 19 మంది సభ్యులు ఉన్నారని భట్టి పేర్కొన్నారు. కానీ కొందరినీ నయానో భయానో బెదిరించి పార్టీలో చేర్చుకున్నారని గుర్తుచేశారు. పార్టీ మారిన వారిపై ఫిరాయింపులు చట్టం కింద చర్యలు తీసుకోలేదని.. కాంగ్రెస్ పార్టీకి 19 మంది సభ్యుల లెక్కన సమయం కేటాయించాలని కోరారు. కానీ తమకు ఇప్పుడు ఉన్న సభ్యుల ప్రకారం ఎలా కేటాయిస్తారని ప్రశ్నించారు.
ప్రస్తుత సభ్యుల ప్రకారం మాట్లాడేందుకు కేవలం 6 నిమిషాల సమయం ఇచ్చారని భట్టి మండిపడ్డారు. ఇది సరికాదు అని.. ఆయన గుర్తుచేశారు. కరోనా పేరు చెప్పి మీడియా పాయింట్ ఈ సెషన్కు పెట్టకపోవడం దారుణమన్నారు. సభలో తమ గొంతు నొక్కుతున్నారని ఎమ్మెల్యే సీతక్క ఆరోపించారు. 2004లో పీవీ చనిపోయిన సమయంలో టీఆర్ఎస్ నేతలు అంత్యక్రియలకు కూడా రాలేదని గుర్తుచేశారు.