జల్సాల కోసం సెల్ఫోన్ల చోరీ: 6గురి అరెస్ట్(ఫొటోలు)
హైదరాబాద్: తమ జల్సాల కోసం ఉస్మానియా ఆస్పత్రి, పరిసర ప్రాంతాలు, బస్టాపుల్లో సెల్ఫోన్ దొంగతనాలకు పాల్పడుతున్న ఆరుగురు నిందితులను అప్జల్గంజ్ పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. కేసుకు సంబంధించిన వివరాలను ఇన్స్పెక్టర్ అంజయ్యతో కలిసి ఏసిపి గిరిధర్ రావు మీడియాకు తెలిపారు.
సరూర్నగర్ మండలం నందనవనం ప్రాంతానికి చెందిన సయ్యద్ యాసిన్, మహ్మద్ అక్బర్, సయ్యద్ అన్వర్, మహ్మద్ అసిఫ్, మహ్మద్ షకీల్, మరో వ్యక్తి ముఠాగా ఏర్పడి చోరీలకు పాల్పడుతున్నారు. సయ్యద్ యాసిన్ ముఠా నాయకుడిగా వ్యవహరిస్తూ ఉస్మానియా ఆస్పత్రి, పరిసర ప్రాంతాల్లో వైద్యులు, అమాయకులే లక్ష్యంగా ఎంచుకొని సెల్ఫోన్లను దొంగతనం చేస్తున్నారు.
దొంగిలించిన సెల్ఫోన్లను తక్కువ ధరకు విక్రయించి వచ్చిన డబ్బులతో జల్సాలు చేస్తున్నారు. కాగా, పలువురు బాధితుల నుంచి ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు, అఫ్జల్గంజ్ పరిసర ప్రాంతాల్లో నిఘా వేసి అనుమానాస్పదంగా సంచరిస్తున్న ఆరుగుర్ని అదుపులోకి తీసుకున్నారు.
వారిని విచారించగా దొంగతనాల విషయం బయటపడింది. నిందితుల నుంచి రూ. 68వేలు, 4 సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.