కెసిఆర్కు మావో షాక్: భద్రాచలం టిఆర్ఎస్ ఇంఛార్జ్ కిడ్నాప్, మావో నేత లొంగుబాటు
ఖమ్మం: తెలంగాణ రాష్ట్ర రాజధానిలోని ఖమ్మం జిల్లాలో కిడ్నాప్ కలకలం చెలరేగింది. అధికార టిఆర్ఎస్ పార్టీ ముఖ్యనేతతో పాటు మరో ఐదుగురిని మావోయిస్టులు కిడ్నాప్ చేశారు. కిడ్నాప్కు గురైన వారిలో టిఆర్ఎస్ నేత రామకృష్ణ ఉన్నారు.
ఆయన 2014 సార్వత్రిక ఎన్నికలలో టిఆర్ఎస్ పార్టీ తరఫున భద్రాచలం శాసన సభ నియోజవకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. రామకృష్ణతో పాటు మరో ఐదుగురిని మావోయిస్టులు కిడ్నాప్ చేశారు. ఈ కిడ్నాప్ బుధవారం జరిగిందని తెలుస్తోంది.
గత రాత్రి ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాల సరిహద్దు ఖానాపూర్ అటవీ ప్రాంతంలో చోటుచేసుకుందని భావిస్తున్న ఎన్కౌంటర్కు మావోయిస్టులు నుంచి ప్రతిస్పందనగా భావిస్తున్నారు.
ఖమ్మం జిల్లా భద్రాచలం టీఆర్ఎస్ ఇంచార్జీ, గత ఎన్నికల్లో పోటీ చేసిన మానె రామకృష్ణతో పాటు ఆ పార్టీకి చెందిన మరో ఐదుగురిని మావోయిస్టులు అపహరించారు. ఖమ్మం జిల్లాలోని చర్ల మండలం పుసుగుప్ప అటవీ ప్రాంతం నుంచి అపహరించారు.
బూటకపు ఎన్కౌంటర్లకు పాల్పడుతున్న టీఆర్ఎస్ ప్రభుత్వ వైఖరికి నిరసనగానే ఆ పార్టీ నేతలను అపహరించినట్లు మావోయిస్టు రాష్ట్ర అధికార ప్రతినిధి జగన్ పేరిట ఓ లేఖ విడుదలైంది. ఏకంగా అసెంబ్లీ నియోజకవర్గ స్థాయి నేత కిడ్నాప్నకు గురి కావడంతో టీఆర్ఎస్ షాక్కు గురైంది.
గాజర్ల అశోక్ లొంగుబాటు
హైదరాబాదులో ఓ మావోయిస్ట్ నేత లొంగిపోయాడు. దండకారణ్యం సెక్రటరీగా ఉన్న గాజర్ల అశోక్ పోలీసులకు లొంగిపోయాడు. అతనిని రెండు రోజుల్లో మీడియా ఎదుట ప్రవేశ పెట్టనున్నారని తెలుస్తోంది. అతని పైన రూ.20 లక్షల రివార్డ్ ఉంది. అనారోగ్యం కారణంగా అతను లొంగిపోయాడని సమాచారం. అతనిపై చాలా కేసులు ఉన్నాయి.