'పని' పేరుతో నమ్మించిన లాయర్: ఇంటికి పిలిచి మరీ మహిళపై గ్యాంగ్ రేప్..
జూన్ 9న ఆమెను ప్రకాశ్ తన ఇంటికి పిలిపించాడు. ఆ సమయంలో కృష్ణ కూడా అక్కడే ఉన్నాడు. ముగ్గురు కలిసి భోజనం చేయగా.. మహిళ చేసిన భోజనంలో మత్తు మందు కలిపారు.
హైదరాబాద్: చూడటానికి ఆయనో పెద్ద మనిషి.. గౌరవప్రదమైన న్యాయవాది.. ఇదంతా పైపై గెటప్ మాత్రమే. లోపలికి తొంగిచూస్తే కానీ ఆయనలోని కీచకుడు కనిపించడు. ఇంట్లో పనికి అని పిలిచి.. మహిళపై అత్యాచారం చేసిన ఘనుడు. హైదరాబాద్ దిల్ షుక్ నగర్ పరిధిలో వెలుగుచూసిన వాస్తవమిది.
వివరాల్లోకి వెళ్తే.. న్యూ నాగోల్లో ప్రకాశ్ (60) అనే ఓ లాయర్ చాలా ఏళ్లుగా కుటుంబంతో కలిసి నివసిస్తున్నాడు. ఇటీవల కొంపెల్లిలోని మరో ఇంట్లోకి అతని కుటుంబం మొత్తం షిఫ్ట్ అయింది. ప్రకాశ్ మాత్రం ఒక్కడే నాగోల్ ఇంట్లో ఉంటున్నాడు. ఈ నేపథ్యంలో తన ఇంట్లో పనిచేసేందుకు ఓ ఆడమనిషి కావాలని తనకు తెలిసిన సెక్యూరిటీ గార్డు కృష్ణ(35)కు చెప్పాడు.
దీంతో కృష్ణ తనకు తెలిసిన మరో సెక్యూరిటీ గార్డును సంప్రదించాడు. యూసుఫ్ గూడకు చెందిన ఓ మహిళ(43) పనిమనిషిగా ఉండేందుకు సమ్మతం తెలిపింది. జూన్ 9న ఆమెను ప్రకాశ్ తన ఇంటికి పిలిపించాడు. ఆ సమయంలో కృష్ణ కూడా అక్కడే ఉన్నాడు. ముగ్గురు కలిసి భోజనం చేయగా.. మహిళ చేసిన భోజనంలో మత్తు మందు కలిపారు.
కొద్దిసేపటికి ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో.. ఇద్దరు కలిసి ఆమెపై అత్యాచారం చేశారు.అనంతరం అదే రోజు రాత్రి ఆమెను రాత్రి యూసుఫ్ గూడలో దిగబెట్టారు. పరువు పోయిందని కుమిలిపోయిన మహిళ.. వారం రోజుల తర్వాత గానీ విషయం ఇంట్లోవాళ్లకు చెప్పలేదు. ఆపై బంధువుల సూచన మేరకు చైతన్యపురి పోలీసులను సంప్రదించి ఫిర్యాదు చేసింది. ప్రస్తుతం కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.