ఏపీకి 613, తెలంగాణకు 544: విద్యుత్ ఉద్యోగుల విభజనపై కీలక ఆదేశాలు
హైదరాబాద్: ఎడతెగని సమస్యగా ఉన్న విద్యుత్ ఉద్యోగుల విభజన వ్యవహారంపై విచారణ జరిపిన జస్టిస్ ధర్మాధికారి కమిటీ.. 1157మంది విద్యుత్ ఉద్యోగుల విభజనపై శనివారం కీలక నిర్ణయాన్ని వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థానికత ఉన్నవారిలో 613మందిని ఏపీ సర్కారు తీసుకోవాలని ఆదేశించింది.
అంతేగాక, వీరి కోసం సూపర్ న్యూమరరీ పోస్టులు క్రియేట్ చేయాలని స్పష్టం చేసింది. ఇక మిగితా 544 మందిని తెలంగాణలో కొనసాగించాలని ఆదేశాలు జారీ చేసింది. కాగా, రాష్ట్ర విభజన అనంతరం ఏపీ స్థానికత ఉన్న 1157 మంది విద్యుత్ ఉద్యోగులను ఏపీకి బదిలీ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
అయితే, తెలంగాణ ప్రభుత్వ నిర్ణయాన్ని పలువురు ఉద్యోగులు వ్యతిరేకించారు. తాము ఇక్కడే కొనసాగుతామని స్పష్టం చేశారు. ఇక ఏపీ ప్రభుత్వం కూడా తమ వద్ద ఖాళీలు లేవని, వారందరినీ చేర్చుకోలేదని తెలిపింది. దీంతో విద్యుత్ ఉద్యోగుల అంశం ఎడతెగని వివాదంగా మారింది.
ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు వరకు ఈ వివాదం వెళ్లింది. దీంతో అందరితో చర్చించి పరిష్కార మార్గాన్ని సూచించేందుకు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ధర్మాధికారి నేతృత్వంలో ఓ కమిటీని సుప్రీంకోర్టు వేసింది. నాటి నుంచి వివిధ అంశాలను పరిశీలించిన ధర్మాధికారి కమిటీ.. శుక్రవారం, శనివారం హైదరాబాద్లో ఏపీ, తెలంగాణ అధికారులతో చర్చించింది.
ఏపీకి వెళ్లేందుకు సిద్ధంగా ఉన్న 613 మందిని ఏపీలో చేర్చుకోవాలని, ఖాళీలు లేకపోతే సూపర్ న్యూమరరీ పోస్టులు సృష్టించాలని స్పష్టం చేసింది. ఇక మిగితా 554మంది ఉద్యోగులు తెలంగాణలోనే కొనసాగుతారని స్పష్టం చేసింది.
అంతేగాక, వీరిలో మరో 265 మంది ఉద్యోగులు తెలంగాణలో పనిచేస్తామంటున్నారని, ఈ విషయాన్ని కూడా పరిగణలోకి తీసుకోవాలని నిర్ణయించింది. విజయవాడలో ఈ విషయంపై నవంబర్ 2,3 తేదీల్లో విచారణ జరుపుతామని, రెండు రాష్ట్రాలకు ఇందుకు సంబంధించిన వివరాలను సమర్పించాలని ఆదేశించింది.