కరోనా: తెలంగాణలో 333కి చేరిన పాజిటివ్ కేసులు, ఆదివారం 62, హైదరాబాద్లో 145 మందికి వైరస్..
తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. ఆదివారం ఒక్కరోజే 62 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వైరస్ సోకి 11 మంది చనిపోగా, 33 మంది కోలుకోగా ఇంటికి పంపించారు. దీంతో కరోనా వైరస్ సోకిన వారి మొత్తం సంఖ్య 333కి చేరుకున్నది. కరోనా వైరస్తో 289 మంది ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. ఇందులో హైదరాబాద్లో అత్యధికంగా 145 కేసులు నమోదవ్వడంతో.. భాగ్యనగర వాసులు భయాందోళనకు గురవుతున్నారు.
రెడీ..
కరోనా వైరస్తో ఆదివారం ఒక్కరు కూడా మృతిచెందలైదని వైద్యాధికారులు తెలిపారు. అలాగే ఒక్క పేషంట్ కూడా డిశ్చార్జ్ కాలేదని వెల్లడించింది. వైరస్ వ్యాప్తి చెందుతోన్న నేపథ్యంలో ఆదివారం సీఎం కేసీఆర్ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. వైరస్ నిరోధించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై డిస్కష్ చేశారు. రాష్ట్రంలో వైరస్ సోకిన వారికి చికిత్స అందించేందుకు తమ వద్ద కావాల్సిన వైద్య పరికరాలు, వైద్యులు అందుబాటులో ఉన్నారని పేర్కొన్నారు.
వైద్య సిబ్బంది కోసమే..
ఆపత్కాలంలో వైద్య సిబ్బంది గొప్ప సేవలు అందిస్తున్నారని సీఎం కేసీఆర్ పొగిడారు. రోగులకు వైద్య సేవలు అందిస్నోన్న వారి ఆరోగ్యంపై ప్రభుత్వం దృష్టిసారించిందని తెలిపారు. సీఎం రిలీఫ్ ఫండ్కు వచ్చిన నగదును సిబ్బంది వ్యక్తిగత రక్షణ అవసరాల కోసం వినియోగిస్తామని తెలిపారు. దీంతోపాటు మాస్క్, మందుల కోసం వాడుతామన్నారు. రోగుల సంఖ్య పెరిగితే మరింత అప్రమత్తంగా ఉండాలని అధికారులకు మార్గనిర్దేశనం చేశారు.
హైదరాబాద్ @ 145
కరోనా వైరస్ పాజిటివ్ కేసులు రాజధాని హైదరాబాద్లో నమోదవడం ఆందోళన కలిగిస్తోంది. సిటీలో 145 పాజిటివ్ కేసులను గుర్తించి వైద్యం అందిస్తున్నారు. ఆ తర్వాత వరంగల్ అర్బన్ 23 కేసులతో రెండోస్థానంలో ఉంది. నిజామాబాద్ జిల్లాలో 10 కరోనా పాజిటివ్ కేసులు రికార్డయ్యాయి. వీరంతా ఇటీవల ఢిల్లీలో జరిగిన ప్రార్థనలకు వెళ్లొచ్చిన వారు కావడం విశేషం.
నిరంతరంగా పరీక్షలు...
రాష్ట్రంలో ఆరు ల్యాబ్లు ప్రతీ నిత్యం పనిచేస్తున్నాయని.. మూడు షిప్టుల్లో రక్త నమూనాలను పరీక్షిస్తున్నారని తెలిపారు. ఇటీవల ఢిల్లీలో జరిగిన మత ప్రార్థనలకు హాజరైన వారితోనే రాష్ట్రంలో కేసులు పెరిగాయని అధికారులు చెప్పారు. అన్ని జిల్లాల్లో సామాజిక దూరం పాటిస్తున్నారని.. దీంతో కేసుల తీవ్రత అంతగా లేదని అధికారులు.. సీఎంకు వివరించారు. వైరస్ తీవ్రత దృష్ట్యా.. రైతులకు ఇబ్బంది కలుగకుండా తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎం ఆదేశించారు. వారికి అందజేసిన టోకెన్ల ఆధారంగా పంట కొనుగోలు చేయాలని స్పష్టంచేశారు.