తెలంగాణలో కొత్తగా 62 కరోనా పాజిటివ్ కేసులు.. ముగ్గురు మృతి..
తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య మళ్లీ పెరుగుతోంది. శుక్రవారం(మే 22) రాష్ట్రంలో మరో 62 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మరో ముగ్గురు మృతి చెందారు. ఈరోజు నమోదైన కేసుల్లో జీహెచ్ఎంసీ పరిధిలో 42 , రంగారెడ్డిలో 1కేసు ఉండగా.. 19 మంది వలసదారులు ఉన్నారు. మరో ఏడుగురు కరోనా నుంచి కోలుకుని ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన బులెటిన్లో ఈ వివరాలను వెల్లడించారు.
ఇతర రాష్ట్రాల్లో నుంచి తెలంగాణకు చెందిన వలస కార్మికులు తిరిగి స్వస్థలాలకు చేరుకుంటుండడంతో.. కరోనా ఎక్కువగా వ్యాపిస్తోందని హెల్త్ బులెటిన్లో పేర్కొన్నారు. తాజా కేసులతో ఇప్పటివరకూ రాష్ట్రంలో కేసుల సంఖ్య 1761కి చేరింది. మృతుల సంఖ్య 48కి చేరింది. ఇప్పటివరకూ 1,048 మంది కోలుకోగా.. ప్రస్తుతం 670 యాక్టివ్ కరోనా కేసులకు చికిత్స అందిస్తున్నారు. ఇక వరంగల్ రూరల్, యాదాద్రి భువనగిరి, వనపర్తి జిల్లాల్లో ఇప్పటివరకూ ఒక్క కరోనా పాజిటివ్ కేసు కూడా నమోదు కాలేదు. మరో 25 జిల్లాల్లో గత 14 రోజులుగా ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదు.
Recommended Video
గురువారం రాష్ట్రంలో 38 కరోనా పాజిటివ్ కేసులు నమోదైన సంగతి తెలిసిందే. ఇందులోనూ అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలోనే 26 కేసులు నమోదయ్యాయి. గురువారం ఒక్కరోజే రాష్ట్రంలో కరోనాతో ఐదుగురు మృత్యువాతపడ్డారు. కేసుల సంఖ్య పెరగడం ఆందోళన కలిగిస్తోంది.