షాక్: ఏటీఎంలో డిపాజిట్ చేయాల్సిన 65లక్షలు మాయం!
బ్యాంకు ఏటీఎంలలో డిపాజిట్ చేయాల్సిన నగదును డిపాజిట్ చేయకుండా కొంతకాలంగా గోల్మాల్కు పాల్పడుతున్న ఇద్దరు వ్యక్తుల బాగోతం ఆలస్యంగా వెలుగుచూసింది.
ఖమ్మం: బ్యాంకు ఏటీఎంలలో డిపాజిట్ చేయాల్సిన నగదును డిపాజిట్ చేయకుండా కొంతకాలంగా గోల్మాల్కు పాల్పడుతున్న ఇద్దరు వ్యక్తుల బాగోతం ఆలస్యంగా వెలుగుచూసింది. ఖమ్మం జిల్లాలో చోటు చేసుకున్న ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
వివరాల్లోకి వెళితే.. ఏటీఎంలలో నగదు డిపాజిట్ చేసే సంస్థలుగా టాటా, బీటీఐ పనిచేస్తున్నాయి. ఇందులో ఖమ్మం రూరల్ మండలంలోని కాశిరాజుగూడెంకు చెందిన చిన్నబోయిన భాస్కర్రావు, మండల వెంకటేశ్వరరావులు ఉద్యోగులుగా పనిచేస్తున్నారు.
ఈ సంస్థల ద్వారా వీరు ఖమ్మంలోని పలు బ్యాంక్లకు చెందిన ఏటీఎం సెంటర్లలో నిత్యం నగదు డిపాజిట్ చేస్తుంటారు. కొంతకాలంగా వీరు ఏటీఎంలలో నగదు డిపాజిట్ చేయకుండా గోల్మాల్కు పాల్పడుతున్నారు. ఇటీవల ఆయా సంస్థలు ఆడిట్ నిర్వహించగా రూ.65 లక్షలు తేడా వచ్చింది. దీంతో వీరిద్దరిని నిలదీయగా తామే దుర్వినియోగానికి పాల్పడినట్లు అంగీకరించారు. దీంతో పోలీసులు నిందితులిద్దరపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
సూర్యాపేటలో నోట్ల మార్పిడి దందా
ఇది ఇలా ఉండగా, పాత నోట్లపై కమీషన్ దందా చేస్తున్న ముగ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలం గడ్డిపల్లిలో మంగళవారం ముగ్గురు వ్యక్తులు నల్లధనాన్ని తెల్లధనంగా మార్చుతున్నారు. ఇందుకోసం 10 నుంచి 15శాతం వరకు కమీషన్ తీసుకుంటున్నారు.
బ్యాంకు ఖాతాదారులకు రూ.500 వరకు ఇచ్చి ఈ దందాను నడుపుతున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు దాడులు చేపట్టి రంగారెడ్డి, బట్టిపల్లి వెంకటరమణ, ఎస్ వీరభద్రయ్యను అదుపులోకి తీసుకున్నారు. వారివద్ద ఉన్న రూ.3లక్షలను స్వాధీనం చేసుకున్నారు.