ఏపీ, తెలంగాణలో 681 మందిపై ఐటీ నిఘా, రిటర్న్స్ సరిగా లేకుంటే తిప్పలే!
హైదరాబాద్: పెద్దనోట్ల రద్దు సమయంలో మీ బ్యాంకు ఖాతాల్లో రూ.కోటి కంటే ఎక్కువ మొత్తాల్లో డిపాజిట్లుగాని చేశారా? అయితే జాగ్రత్త. ఈ నెలాఖరులోగా ఫైల్ చేసే ఐటీ రిటర్న్స్లో ఆ ఆదాయానికి సంబంధించి సరైన లెక్కలు చెప్పకపోతే తిప్పలు తప్పవు.
ఎందుకంటే పెద్దనోట్ల రద్దు తరువాత ఇలా తమ బ్యాంకు ఖాతాల్లో పెద్ద మొత్తాల్లో డబ్బులు డిపాజిట్ చేసిన బడాబాబుల్లో కొందరు ఐటీ రిటర్న్లు ఫైల్ చేయలేదు. దేశ వ్యాప్తంగా ఇలాంటి వ్యక్తులు, సంస్థలు, భాగస్వామ్య సంస్థలు 10,238 వరకు ఉన్నాయి.
వీటిలో 681 మంది రెండు తెలుగు రాష్ట్రాల్లోనే ఉన్నట్లు హైదరాబాద్లోని ఏపీ, తెలంగాణ ఆదాయపన్ను శాఖ ప్రిన్సిపల్ చీఫ్ కమిషనర్ తెలిపారు. ఆయా వ్యక్తుల వ్యాపార కార్యకలాపాలు, ఆర్థిక లావాదేవీలు నిరంతరం తమ నిఘాలు ఉన్నట్లు పేర్కొన్నారు.
ఈ నగదు డిపాజిట్లకు సంబంధించి సరైన సమాచారంతో ఈ నెలాఖరులోగా రిటర్న్స్ దాఖలు చేయకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవలసి వస్తుందని హెచ్చరించారు. ఇలా రిటర్న్స్ దాఖలు చేయని ఈ 681 మందిలో 448 మంది హైదరాబాద్ ప్రాంతానికి, 153 మంది విజయవాడ ప్రాంతానికి, 80 మంది విశాఖ ప్రాంతానికి చెందిన వారని ప్రిన్సిపల్ కమిషనర్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.