హైదరాబాద్ లో పెరుగుతున్న వైరస్ - వారంలో 682 కేసులు : ఒకే అపార్ట్ మెంట్ లో పది మందికి..!!
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో వైరస్ మరో సారి కలవర పెడుతోంది. కరోనా నుంచి బయటపడుతున్న సమయంలో ఇప్పుడు ప్రపంచ దేశాలను వణికిస్తున్న ఓమిక్రాన్ కేసులు దేశంలో నాలుగు నమోదయ్యాయి. ఇప్పటికే యూకే సహా సింగపూర్, కెనడా, అమెరికా వంటి దేశాల నుంచి వచ్చిన 13 మందికి కోవిడ్ పాజిటివ్ నిర్ధారణ కావడం, హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో కోవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతుండటం గ్రేటర్ వాసులను ఆందోళనకు గురిచేస్తోంది.
గతంతో పోలిస్తే ప్రస్తుతం కేసుల సంఖ్య మాత్రమే తగ్గిందని, వైరస్ తీవ్రత ఇంకా అలాగే కొనసాగుతోందని ప్రభుత్వం సహా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు.
ఊపిరి పీల్చుకుంటున్న సమయంలో
ప్రభుత్వం..వైద్యాధికారులు కోవిడ్ ప్రోటోకాల్ ను ఖచ్చితంగా పాటించాలని ఆదేశిస్తున్నారు. ఈ ఏడాది ఏప్రిల్, మే, జూన్ మాసాల్లో భారీగా కోవిడ్ కేసులు నమోదైనప్పటికీ..ఆ తర్వాతి నుంచి కేసుల సంఖ్య క్రమంగా తగ్గుముఖం పడుతూ వచ్చింది. ప్రజల ఆర్థిక ప్రమాణాలు పూర్తిగా దెబ్బతిని సంక్షోభం తలెత్తే ప్రమాదం ఉందని భావించిన ప్రభుత్వం దశల వారీగా కోవిడ్ ఆంక్షలను ఎత్తేసింది.
సెప్టెంబర్ నుంచి ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలు పునః ప్రారంభం కావడం...మార్కెట్లు సహా వ్యాపార, వాణిజ్య సంస్థలు పూర్తిస్థాయిలో తెరుచుకోవడం..ఐటీ కంపెనీలు వర్క్ ఫ్రం హోమ్ను ఎత్తేవేయడంతో. సాధారణ పరిస్థితులు నెలకుంటున్నాయి.
విదేశీ ప్రయాణీకులపై ఆంక్షలు
ఈ సమయంలో ప్రభుత్వం అప్రమత్తమై విదేశీ ప్రయాణికులపై ఆంక్షలు విధించింది. శంషాబాద్ విమానాశ్రయంలో అడుగుపెట్టిన వెంటనే వారికి ఆర్టీపీసీఆర్ టెస్టులు చేస్తోంది. వైరస్ లేదని నిర్ధారించుకున్న తర్వాత ఇంటికి పంపుతోంది. 14 రోజుల పాటు హోం కార్వంటైన్లో ఉండాల్సిందిగా సూచిస్తోంది. ఇక, బండ్లగూడ జాగీరు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో కోవిడ్ కలకలం సృష్టించింది.
పీరంచెరువులోని ఓ గేటెడ్ కమ్యూనిటీలో ఉంటున్న పది మందికి కరోనా పాజిటివ్గా తేలింది. దీంతో అపార్ట్మెంట్ వాసులంతా భయాందోళనకు గురయ్యారు. గేటెడ్ కమ్యూనిటీలోని బ్లాక్లో ఓ వ్యక్తి భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి నివసిస్తున్నాడు. కొన్ని రోజుల క్రితం అతను ఢిల్లీకి వెళ్లి హైదరాబాద్కు తిరిగి వచ్చాడు.
ఒకే అపార్ట్ మెంట్ లో పది మందికి
వీరి కుటుంబ సభ్యులకు అనారోగ్య సమస్యలు తలెత్తడంతో కరోనా పరీక్షలు చేశారు. మొత్తం నలుగురికీ పాజిటివ్గా నిర్ధారణ అయింది. మరో బ్లాక్లో ఉంటున్న ఆరుగురు కుటుంబ సభ్యులకూ కరోనా పాజిటివ్గా తేలింది. వీరందరినీ ఐసొలేషన్లో ఉంచారు. ఈ విషయాన్ని గేటెడ్ కమ్యూనిటీ సభ్యులు కార్పొరేషన్ అధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో అపార్ట్మెంట్ను పరిశీలించి శానిటైజ్ చేశారు. అపార్ట్మెంట్ మొత్తం సోడియం హైపోక్లోరైట్ మిశ్రమంతో పిచికారీ చేయించారు. ప్రస్తుతం బాధితులు హోం ఐసొలేషన్లో ఉన్నారు.
Recommended Video
ప్రభుత్వం హెచ్చరిస్తున్నా...
విద్యార్థుల ఆరోగ్యంపై తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తుండటంతో ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలు, గురు కులాలను హాట్స్పాట్ల జాబితాలో చేర్చి ఆమేరకు నియంత్రణ చర్యలు చేపట్టింది. ఆరోగ్య శిబిరాలు ఏర్పాటు చేసి విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిని అంచనా వేస్తోంది. విద్యార్థులంతా మాస్క్లు ధరించేలా..ప్రతి పీరియడ్ తర్వాత విధిగా శానిటైజర్లతో చేతులను శుభ్రం చేసుకునేలా..జాగ్రత్తలు సూచిస్తోంది. నిన్న మొన్నటి వరకు బెంచికి నలుగురైదుగురు విద్యార్థులు కూర్చోగా..ప్రస్తుతం ఇద్దరు,ముగ్గురికే పరిమితం చేసింది.