కిలోల కొద్దీ బంగారంతో పట్టుబడిన మహిళలు
హైదరాబాద్: శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇద్దరు మహిళలు కిలోల కొద్దీ బంగారంతో పట్టుబడ్డారు. కస్టమ్స్ అధికారులు గురువారం ఉదయం అక్రమంగా తీసుకువచ్చిన 7 కిలోల బంగారాన్ని పట్టుకున్నారు. ప్రయాణికుల తనీఖీల్లో భాగంగా సమీరా, సింథియా అనే ఇద్దరు మహిళల వద్ద నుంచి అధికారులు ఈ బంగారంను స్వాధీనం చేసుకున్నారు. మహిళలిద్దరూ దుబాయ్ నుంచి హైదరాబాద్ నగరానికి వచ్చారు.
దంపతుల దారుణహత్య
ఇదిలావుంటే, నిజామాబాద్ జిల్లా ఎడవల్లి మండలం జానకంపేటలో దంపతుల దారుణహత్య జరిగింది. కొందరు దుండగులు బండరాళ్లతో మోది దంపతులను హతమార్చారు. మృతుల వివరాలు, సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలంను పరిశీలించి వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
వడ్డీవ్యాపారి ఆగడాలు
హైదరాబాద్లోని పాతబస్తీలో వడ్డీ వ్యాపారుల ఆగడాలు మితిమీరిపోయాయి. ట్రావెల్ ఏజెంట్ షరీఫ్ వడ్డీ వ్యాపారి నారాయణరెడ్డి వద్ద రూ. 10 వడ్డీ చొప్పున రూ. 4 లక్షలు తీసుకున్నాడు. సకాలంలో వడ్డీ చెల్లించలేదని వడ్డీ వ్యాపారి షరీఫ్ను కిడ్నాప్ చేశాడు. అనంతరం అల్మాన్గూడలో బంధించి చిత్రహింసలకు గురిచేశాడు.
కిడ్నాప్ విషయంపై షరీఫ్ బంధువులు పోలీసులను ఆశ్రయించారు. పిటిషన్ను స్వీకరించిన సంతోష్నగర్ పోలీసులు అల్మాన్గూడలో దాడులు చేసి షరీఫ్ను విడిపించారు. జరిగిన ఘటనతో పోలీసులు వడ్డీ వ్యాపారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.