తెలంగాణలో భారీగా తగ్గిన కరోనా కొత్త కేసులు: సర్కారుకు కేంద్ర బృందం ప్రశంస
హైదరాబాద్: తెలంగాణలో నిన్న మొన్నటి వరకు భారీ సంఖ్యలో కరోనా పాజిటివ్ కేసులు నమోదైన విషయం తెలిసిందే. అయితే, శనివారం మాత్రం ఈ సంఖ్య తగ్గుముఖం పట్టినట్లు కనిపించింది. రాష్ట్ర వ్యాప్తంగా శనివారం కేవలం 7 కరోనా పాజిటివ్ కేసులు మాత్రమే నమోదైనట్లు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ వెల్లడించింది. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 990కి చేరిందని తెలిపింది.
తాజా 7 కేసుల్లో..
తాజాగా నమోదైన కేసుల్లో జీహెచ్ఎంసీ పరిధిలో 6 కాగా, వరంగల్ అర్బన్ జిల్లాలో మరో కేసు నమోదైంది. శనివారం ఎవరూ మృతి చెందలేదని, ఇప్పటి వరకు రాష్ట్రంలో మరణించిన వారి సంఖ్య 25కు చేరిందని వైద్యారోగ్యశాఖ వెల్లడించింది. ప్రస్తుతం రాష్ట్రంలో 658 మంది బాధితులు చికిత్స పొందుతుండగా, 307 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు.
నగరంలో పర్యటించిన కేంద్ర బృందం
కాగా, తెలంగాణ రాష్ట్రంలో కరోనా నివారణ చర్యలను పరిశీలించేందుకు వచ్చిన కేంద్ర బృందం రాష్ట్ర ప్రభుత్వంపై ప్రశంసలు కురిపించిందని సీఎస్ సోమేశ్ కుమార్ తెలిపారు. కేంద్ర బృందం శనివారం హైదరాబాద్ నగరంలో పర్యటించింది. పూర్తి స్థాయి కొవిడ్ ఆస్పత్రిగా గచ్చిబౌలిలోని టిమ్స్ ఆస్పత్రిని సందర్శించిన కేంద్ర బృందం అధికారులు అక్కడ ఏర్పాట్లు, సౌకర్యాలపై ఆరా తీశారు. ఆ తర్వాత ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, పోలీసు ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. రాష్ట్రంలో తీసుకుంటున్న కరోనా నియంత్రణ చర్యలు, లాక్ డౌన్ అమలు తీరుపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.
Recommended Video
సర్కారు తీసుకుంటున్న చర్యలు భేష్
ఈ సందర్భంగా కేంద్ర బృందానికి రాష్ట్ర ప్రభుత్వం కరోనా కట్టడికి తీసుకుంటున్న చర్యలను వివరించారు సీఎస్ సోమేశ్ కుమార్. కరోనా చికిత్స, కంటైన్మెంట్ జోన్ల నిర్వహణ, క్వారంటైన్ కేంద్రాల గురించి తెలిపారు. లాక్ డౌన్ సమయంలో పేదలు, వలస కూలీలకు బియ్యం, నగదు పంపిణీ చేస్తున్నామని చెప్పారు. షెల్టర్ హోమ్స్, అన్నపూర్ణ కేంద్రాల గురించి వివరించారు. సీఎం ఆదేశాలతో లాక్ డౌన్ ను కఠినంగా అమలు చేస్తున్నామని తెలిపారు. అలాగే, నగరంలో పోలీసు శాఖ తీసుకుంటున్న చర్యలను హైదరాబాద్ సీపీ అంజనీకుమార్ కేంద్ర బృందానికి వివరించారు. కరోనా కట్టడికి తీసుకుంటున్న చర్యలపై సంతృప్తి వ్యక్తం చేసిన కేంద్ర బృందం.. రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశంసించారు.