ఏడుగురి ప్రాణం తీసిన కాళేశ్వరం ప్రాజెక్టు: ఎందుకిలా జరిగింది?
సిరిసిల్ల/కరీంనగర్: కాళేశ్వరం ప్రాజెక్టు పదో ప్యాకేజీలో రాజన్న సిరిసిల్ల జిల్లా తిప్పాపూర్ వద్ద సొరంగ మార్గంలో బుధవారం జరిగిన ప్రమాదంలో ఏడుగురు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. అయితే, అసలు ఈ ప్రమాదం ఎందుకు జరిగింది? ఎవరి నిర్లక్ష్యం వల్ల ఈ ఏడు ప్రాణాలు పోయాయనేది చర్చనీయాంశంగా మారింది.
కాళేశ్వరం పనుల్లో అపశృతి: పైకప్పు కూలి ఏడుగురు మృతి
తెలుగువాడితోపాటు ఏడుగురు మృతి
ఆ వివరాల్లోకి వెళితే.. రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట తిప్పాపూర్ వద్ద బుధవారం మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో జరిగిన ఘోరమిది. మృతుల్లో ఆరుగురు జార్ఖండ్, ఒడిశా, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలకు చెందినవారు కాగా.. మరొకరు భూపాలపల్లి జిల్లా ములుగు గ్రామానికి చెందిన ఎలక్ట్రీషియన్ యానం సందీప్(27).
ఉన్నపళంగా కూలిపడిన బండరాయి
కాళేశ్వరం ప్రాజెక్టు ప్యాకేజీ-10లో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లా పరిధిలో తిప్పాపూర్ సమీపంలో మూడు గుట్టల మధ్య 92 మీటర్ల లోతు, 56 మీటర్ల డయాతో సర్జ్పూల్ అనే మహాబావిని, మిడ్ మానేరు నుంచి 3 కిలోమీటర్ల కాలువను, 8 కిలోమీటర్ల సొరంగమార్గాన్ని నిర్మిస్తున్నారు. 9.5 మీటర్ల డయాతో రోజూ 11 వేల క్యూసెక్కుల నీరు ప్రవహించేవిధంగా ఈ సొరంగమార్గాన్ని నిర్మిస్తున్నారు. దీని ద్వారా రోజు ఒక టీఎంసీ నీరు సర్జ్పూల్కు, అక్కడి నుంచి మల్లన్న సాగర్కు వెళ్తుంది.
ప్రతిమ కన్స్ట్రక్షన్ కంపెనీవారు ఈ సర్జ్పూల్, సొరంగమార్గం పనులను చేపట్టారు. బుధవారం సొరంగమార్గంలో పైకప్పు డ్రిల్లింగ్ చేస్తున్న సమయంలో 10 మీటర్ల పొడవు రాయి ఉన్నపళంగా కూలిపోయింది. దీంతో పని స్థలంలో ఉన్న 8 మంది ఆ శిథిలాల మధ్య చిక్కుకొనిపోయారు. వారిలో ఆరుగురు అక్కడికక్కడే మరణించారు. జార్ఖండ్ రాష్ట్రం రాంగఢ్ జిల్లా బార్లేంగా గ్రామానికి చెందిన పురంసింగ్, గడ్మా తీవ్రంగా గాయపడ్దారు. చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించగా.. పురం సింగ్ కరీంనగర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు.
ప్రమాదం జరిగిన సమయంలో 27మంది అక్కడే..
ప్రమాదం జరిగిన సమయంలో టన్నెల్లో దాదాపు వంద మంది వరకూ పనిచేస్తుండగా.. బండరాళ్లు పడ్డ చోట 27మంది కార్మికులు ఉన్నారు. ప్రమాద సమాచారం అందగానే.. రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ కృష్ణభాస్కర్, డీఐజీ రవివర్మ, ఎస్పీ విశ్వజిత్ కాంపాటి అక్కడికి చేరుకుని వివరాలు తెలుసుకున్నారు. మృతదేహాలను కరీంనగర్ ఆసుపత్రికి తరలించారు.
ప్రమాదానికి బ్లాస్టింగే కారణం.. నిర్లక్ష్యం కూడా
కాగా, ఈ ప్రమాదానికి కారణంపై పలు వాదనలు వినిపిస్తున్నాయి. ప్రాజెక్ట్ వద్ద పనిచేస్తున్న వారిలో కొందరు.. లోపల బ్లూమర్ వద్ద టన్నెల్లోకి పంపించే ఎయిర్ పైపు బ్లాస్ట్ అయ్యిందని చెప్పగా.. మరికొందరు డ్రిల్ చేసి బ్లాస్టింగ్ చేసే సమయంలో పెద్ద బండరాళ్లు కూలడం వల్లనే ప్రమాదం జరిగిందని వివరించారు. అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించి అక్కడి వారిని అప్రమత్తం చేయకపోవడం వల్లే ఏడుగురు ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చిందని చెబుతున్నారు. అయితే, బ్లాస్టింగ్ వల్లనే ప్రమాదం జరిగిందని ఎఫ్ఐఆర్లో చేర్చనున్నట్లు కరీంనగర్ జిల్లా కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ తెలిపారు. ప్రమాదం 12.30 గంటలకు జరగ్గా.. గాయపడ్డ కార్మికుల్లో ఒకడైన గడ్మా ఇల్లంతకుంట మండలకేంద్రంలోని ప్రాథమిక ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ‘టన్నెల్లో ప్రమాదం జరిగింది. చాలా మంది చనిపోయి ఉంటారు' అని చెప్పడంతో మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఈ విషయం బయటికొచ్చింది.
ప్రత్యేక్ష సాక్షిగా 15ఏళ్ల బాలుడు
తిప్పాపూర్లో టన్నెల్ పనులకు జార్ఖండ్ రాష్ట్రం రాంఘడ్ జిల్లా బార్లెంగా గ్రామం నుంచి పురంసింగ్తో పాటు 15 ఏళ్ల అతని సోదరుడు దేవసాన్ లుక్మా కూడా వచ్చాడు. పురంసింగ్తో పాటు టన్నెల్లోకి దేవసాన్ వెళ్లాడు. పురంసింగ్ డ్రిల్లింగ్ పనులు చేస్తుండగా దూరంగా ఉండి చూస్తుండగా టన్నెల్ కూలిందని దేవసాన్ తెలిపాడు.
మృతుల వివరాలు
యానం సందీప్- భూపాలపల్లి జిల్లా ములుగుకు చెందిన ఎలక్ట్రీషియన్
రామకృష్ణ
సాహు-
ఒడిసా
రాష్ట్రం
గజన్
జిల్లా
పందిరితాలాపూర్వాసి
భూధన్
సోరెన్-
జార్ఖండ్
రాష్ట్రం,
ఈస్ట్
సింగాభూం
జిల్లా
రాయెచేడివాసి
అహీం
అన్స్డా-
ఒడిసా
రాష్ట్రం,
బార్గఢ్
జిల్లా,
జామ్లావాసి
హరీష్
చంద్
నూతన్-
ఛత్తీస్గఢ్
రాష్ట్రం
బస్తర్
జిల్లా,
శాంతాపూర్వాసి
ఘాట్
మాత్రో-
జార్ఖండ్
రాష్ట్రం,
రాంగఢ్
జిల్లా,
కేటీగావావాసి
సబ్ కాంట్రాక్టర్కు అర్హత ఉందా?
ఈ పనిని అనధికార సబ్ కాంట్రాక్టర్(ఉప గుత్తేదారు) చేస్తున్నారు. మిడ్మానేరు నుంచి నీటిని మళ్లించే ఈ పనిని పదవ ప్యాకేజీగా మొదట రూ.1,980 కోట్లకు గుత్తేదారుకు అప్పగించారు. తర్వాత పునరాకృతిలో ఈ పని విలువ రూ.2,750 కోట్లుకాగా, ఇందులో మోటార్లు, పంపులు పోనూ మిగిలిన పనిని హిందూస్థాన్ కన్స్ట్రక్షన్ కంపెనీ(హెచ్సీసీ) చేయాల్సి ఉంది. ఈ సంస్థ చేయాల్సిన పనిని అనధికారికంగా ఉపగుత్తేదారులు చేస్తున్నారు. మిడ్మానేరు నుంచి అప్రోచ్కాలువ, గ్రావిటీకాలువ, సొరంగ మార్గం, సర్జ్పూల్, పంపుహౌస్ సివిల్ పనులు, అనంతగిరి రిజర్వాయర్ నిర్మాణ పనులు ఉన్నాయి. ఇందులో సర్జ్పూల్, పంపుహౌస్, రిజర్వాయర్ నిర్మాణ పనులను ప్రతిమ ఇంజినీరింగ్ కంపెనీ చేస్తుండగా, అప్రోచ్కాలువ, సొరంగమార్గం పనులను కెఎస్ఆర్ సంస్థ చేస్తుంది.
అనధికారికంగా పనులు చేస్తున్న ఈ సంస్థలకు అధికారికంగా ఉప గుత్తేదారుగా నిర్ణయించేందుకు సంబంధించిన ప్రతిపాదనలు ప్రభుత్వానికి వచ్చినా ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు. ఉప గుత్తేదారు తీసుకొనే పనిని పూర్తి చేయడానికి అవసరమైన అర్హతలు ఉండాలి. ఈ అర్హతలను నీటిపారుదల శాఖ అధికారులు పరిశీలిస్తున్నట్లు తెలిసింది. ప్రధాన గుత్తేదారు సగం పనిని మాత్రమే ఉప గుత్తేదారులకు అప్పగించడానికి అవకాశంఉంది. అయితే ఇక్కడ మాత్రం దాదాపు మొత్తం పనిని అప్పగించినట్లు సంబంధిత వర్గాల ద్వారా తెలిసింది. అతి పెద్ద సర్జ్పూల్ ఈ ప్యాకేజీలో నిర్మించగా దీనిని ఉపగుత్తేదారే పూర్తి చేశారు. అండర్గ్రౌండ్ పంపుహౌస్నకు సంబంధించిన సివిల్ పనులను కూడా ఈ సంస్థ ఎక్కువ భాగం పూర్తి చేయడం గమనార్హం.