మృగాళ్లు చిదిమేశారు: పుట్టినరోజే కన్నవాళ్లకు కడుపు శోకం, భూపాలపల్లిలో 6 ఏళ్ల బాలికపై అమానవీయం..
భూపాలపల్లి: తెల్లవారితే పుట్టినరోజు. చిన్నారుల మధ్య సందడిగా గడపాల్సిన రోజు. గారాలపట్టి పుట్టినరోజు కోసం ఆ కుటుంబం కూడా అన్ని ఏర్పాట్లు చేసుకుంది. కొత్త బట్టలు, పూలు, కేకు వగైరా అన్నీ తెప్పించారు.
కానీ అంతా తలకిందులైంది. పుట్టినరోజు నాడే ఆ చిన్నారి విగతజీవిగా కనిపించింది. కన్నపేగు తల్లడిల్లింది. కన్నూ మిన్నూ కానని కామం ఆ చిన్నారని కాటేసినందుకు గుండెలు బాదుకుంటూ ఆ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో చోటు చేసుకున్న దారుణమిది.
చిన్నారి రేష్మ:
జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం గోరుకొత్తపల్లి గ్రామానికి చెందిన ఈర్ల రాజు, ప్రవల్లిక దంపతుల ఏకైక కుమార్తె రేష్మ (6). స్థానిక ప్రభుత్వ పాఠశాలలో యూకేజీ చదువుతోంది. సోమవారం పుట్టినరోజు కావడంతో ఆదివారం నాడే అన్నీ కొనిపించుకుంది.
కొవ్వొత్తుల ర్యాలీ:
ఇటీవల ఎమ్మార్పీఎస్ ఛలో అసెంబ్లీ సందర్భంగా మహిళా నేత భారతక్క మృతి చెందిన సంగతి తెలిసిందే. భారతక్కను గుర్తుచేసుకుంటూ భూపాలపల్లిలో ఆదివారం కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో డీజే సౌండ్ సిస్టమ్ కూడా ఏర్పాటు చేశారు. పెద్ద ఎత్తున పాటలు వినిపించడంతో స్థానికులు ర్యాలీని ఆసక్తిగా చూశారు.
బయటకొచ్చి.. అదృశ్యం:
డీజే సౌండ్ విన్న రేష్మ కూడా ఇంటినుంచి బయటకు వచ్చింది. అయితే కొద్దిసేపటికే ఆమె అదృశ్యమైపోయింది. కుటుంబ సభ్యులు, గ్రామస్తులు అంతటా గాలించినా ఎక్కడ ఆచూకీ దొరకలేదు. దీంతో అర్థరాత్రి ఒంటి గంటన్నర సమయంలో రేగొండ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. సోమవారం ఉదయం గ్రామానికి వచ్చిన పోలీసులు చిన్నారి అదృశ్యంపై ఆరా తీశారు.
విగత జీవితగా:
చిన్నారి కోసం గాలిస్తుండగా మధ్యాహ్నాం 3గం. సమయంలో ఎస్సీ కాలనీ సమీపంలోని గడ్డివాము వద్ద చిన్నారి విగతజీవిగా పడి ఉండటం స్థానికులు గమనించారు. వెంటనే కుటుంబ సభ్యులకు సమాచారం అందించడంతో బిడ్డను అలా చూసి గుండెలవిసేలా ఏడ్చారు. చిన్నారి ఒంటిపై రక్తపు మరకలు, గొంతు నులిమినట్లు గాయాలున్నాయి. అత్యాచారం చేసి చంపేసి ఉంటారని అనుమానిస్తున్నారు. ఇద్దరు లేదా ముగ్గురు నిందితులు ఈ అఘాయిత్యానికి పాల్పడి ఉండవచ్చునని పోలీసులు అనుమానిస్తున్నారు.