150మంది విద్యార్థుల వెనక్కి: వీసా స్కాంలో 8హైదరాబాద్ సంస్థలు
హైదరాబాద్: నకిలీ వీసా పత్రాల కారణంగా న్యూజిలాండ్లో విద్యనభ్యసించేందుకు వెళ్లిన సుమారు 150మంది హైదరాబాద్ విద్యార్థులను ఆ దేశం వెనక్కి పంపేసిన విషయం తెలిసిందే. దీంతో విధిలేని పరిస్థితుల్లో హైదరాబాద్ చేరుకున్నారు విద్యార్థులు.
కాగా, ఈ వీసాల స్కాంలో హైదరాబాద్కు 8 కన్సల్టెన్సీ సంస్థలే కీలకంగా ఉన్నాయని తెలిసింది. ఈ మేరకు న్యూజిలాండ్కు చెందిన ముంబై ప్రాంతీయ కార్యాయయం వెల్లడించింది.
వీసా షాక్: న్యూజిలాండ్ నుంచి 150మంది తెలుగు విద్యార్థుల వెనక్కి
వీసా స్కాంలో.. కీవీ ఓవర్సీస్ సర్వీసెస్, సన్రైజ్ ఓవర్సీస్ ఎడ్యుకేషనల్ కన్సల్టెంట్స్, ఐవీవై ఓవర్సీస్ ఆఫ్ ఎస్ఆర్ నగర్, ఫీఫో ఓవర్సీస్, లీఫ్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్, ఏఆర్ ఓవర్సీస్ కన్సల్టెంట్స్ ఆఫ్ దిల్సుఖ్నగర్, స్టోర్మ్ అట్లాస్ అండ్ వీ అండ్ యూ ఇంటలెక్ట్ కన్సల్టెంట్ సంస్థలు ఉన్నాయి.
వీసాలు తిరస్కరించబడిన వారిలో భారత విద్యార్థులే ఎక్కువగా ఉన్నారని న్యూజిలాండ్ ఇమ్మిగ్రేషన్ అధికారులు వెల్లడించారు. ఈ జాబితాలో హైదరాబాద్కు చెందిన విద్యార్థులే ఎక్కువగా ఉన్నారని తెలిపారు. నకిలీ వీసా ఫైనాన్సిషియల్ పత్రాలతో హైదరాబాద్కు చెందిన సంస్థలు పంపిన 150మంది హైదరాబాద్ విద్యార్థులకు తమ దేశం విడిచి వెళ్లాలనే లేఖలు అందజేసినట్లు న్యూజిలాండ్ అధికారులు వివరించారు.
'విద్యార్థులు దేశంలో ప్రవేశించిన సమయంలోనే అన్ని పత్రాలు పరిశీలించబడవు. విద్యా రుణాలు మంజూరు చేసే సమయంలోనే విద్యార్థుల ఆర్థిక పత్రాలు పరిశీలించడం జరుగుతుంది. ఈ పత్రాలు పరిశీలనకు కాస్త సమయం పడుతుంది. కాబట్టి, ఏజెంట్లు విద్యార్థులను నకిలీ ఆర్థిక పత్రాలతో మోసం చేశారు' అని ఈ హైదరాబాద్ కన్సల్టెన్సీ సంస్థలపై న్యూజిలాండ్ ఇమ్మిగ్రేషన్ అధికారులు తెలిపారు.
కాగా, హైదరాబాద్ నుంచి న్యూజిలాండ్కు విద్యార్థులను పంపడంలో కీవీ ఓవర్సీస్ సర్వీసెస్ అనే సంస్థ బాగా గుర్తింపు వచ్చింది. దీంతో విద్యార్థులు ఈ సంస్థ ద్వారానే న్యూజిలాండ్ వెళ్లేందుకు మొగ్గుచూపుతున్నారు. కాగా, 2015 జనవరి నుంచి ఈ సంస్థ ద్వారా దాఖలైన 104 దరఖాస్తుల్లో 48మాత్రమే ఆమోదం పొందడం గమనార్హం. ఇందులో సుమారు 31మంది అంటే 65శాతం మంది విద్యార్థులు నకిలీ రుణ పత్రాల కారణంగా న్యూజిలాండ్ నుంచి బహిష్కరణ లేఖలు అందుకున్నారు.
హైదరాబాద్లోని వివిధ బ్యాంకులతో కలిసి ముంబై ప్రాంతీయ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. కాగా, మైగ్రేంట్ వర్కర్స్ అసోసియేషన్ ఆఫ్ ఆటటియరోవా(న్యూజిలాండ్) హైదరాబాద్ కు చెందిన 9మంది విద్యార్థులకు సహాయాన్ని అందించాయి. చరణ్ రెడ్డి, సునీల్ చింత, షుజాత్ ఉల్లా బేగ్, తీగల సాయిరూప్ రెడ్డి, మనోజ్ కిరణ్, హఫీజ్ సయ్యద్, రామకృష్ణ రెడ్డి, ప్రదీప్ రెడ్డిలకు వారు సాయాన్ని అందించారు.
'హైదరాబాద్లోని 57 ఏజెంట్లపై విచారణ చేపట్టాం. బ్యాంక్ అధికారుల అవినీతి, ఏజెంట్ల మోసం వల్ల విద్యార్థులు బలయ్యారని తెలుసుకున్నాం. అయితే, నివేదిక మాత్రం సదరు బ్యాంకుల పేర్లను వెల్లడించడం లేదు. న్యూజిలాండ్లో భారత రాయబారి సంజీవ్ కోహ్లీని విద్యార్థులకు సహాయం చేయాలని కోరాం' అని ఎండబ్ల్యూఏ అను కలోటి తెలిపారు.
కాగా, కొందరు విద్యార్థులు విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్కు ట్విట్టర్ ద్వారా తమ సమస్యను వివరించారు. అయితే ఎలాంటి స్పందన రాలేదని వారు వాపోయారు. కాగా, న్యూజిలాండ్ ఇమ్మిగ్రేషన్ అధికారులు రుణ చెల్లింపు పత్రాలను సరిగా పరిశీలించడం లేదని తెలుస్తోందని ఆమె అన్నారు. ఇది ఇలా ఉండగా, హైదరాబాద్లోని ఆ 8 కన్సల్టెన్సీ సంస్థలు తమ దుకాణాలను మూసేశాయి. తమ వెబ్సైట్లను కూడా తాత్కాలికంగా నిలిపివేశాయి.