తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు: 9వేల మార్క్ దాటింది, 3 మరణాలు
హైదరాబాద్: తెలంగాణలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. మంగళవారం తాజాగా 879 పాజిటివ్ నమోదైనట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 9553కు చేరింది. వీటిలో అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 652 కేసులు, మేడ్చల్ జిల్లాలో 112, రంగారెడ్డిలో జిల్లాలో 62 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
మంగళవారం 3006 మంది నమూనాలను పరీక్షించగా.. 897 పాజిటివ్ కేసులు తేలాయని ఆరోగ్యశాఖ తెలిపింది. కరోనా బాధితుల్లో 219 మంది డిశ్చార్జ్ కాగా, మరో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 4224 మంది కోలుకుని డిశ్చార్జ్ కాగా, 220 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం 5109 యాక్టివ్ కేసులున్నాయి.
జిల్లాల వారీగా గమనిస్తే జీహెచ్ఎంసీలో 652, రంగారెడ్డిలో 64, మేడ్చల్ 112, జనగామ 7, సంగారెడ్డి 2, వరంగల్ రూరల్ 14, మంచిర్యాల 2, కామారెడ్డి 10, వరంగల్ అర్బన్ 9, మహబూబాబాద్ 2, 2, మెదక్ 1, నాగర్ కర్నూలు 4 కేసులు నమోదయ్యాయి.
ఇది ఇలావుండగా, బస్ భవన్లో ఇద్దరికీ కరోనా పాజిటివ్ అని తేలింది. రెండో అంతస్తులో చీఫ్ ట్రాఫిక్ మేనేజర్, ఐటీ విభాగంలో పనిచేస్తున్న ఉద్యోగి కరోనా బారినపడ్డారు. దీంతో అప్రమత్తమైన అధికారులు కార్యాలయంలో శానిటైజ్ చేయించారు. ఉద్యోగులు, సిబ్బందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. కాగా, బస్ భవన్ లో బుధవారం జరగాల్సిన తెలుగు రాష్ట్రాల ఆర్టీసీ అధికారుల సమావేశం వాయిదా పడింది.