శ్రీశైలం పవర్ ప్లాంట్ అగ్నిప్రమాదంలో 9మంది మృతి..మృతుల కుటుంబాల్లో విషాదం..మిన్నంటిన రోదనలు
శ్రీశైలం జలవిద్యుత్ కేంద్రంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా జరిగిన అగ్ని ప్రమాద ఘటనలో విషాదం చోటు చేసుకుంది . శ్రీశైలం జలవిద్యుత్ కేంద్రం లో జరిగిన అగ్ని ప్రమాదంలో లోపల చిక్కుకున్న తొమ్మిది మంది మరణించినట్లుగా తెలుస్తుంది. ఇప్పటి వరకు రెస్క్యూ టీం మొత్తం తొమ్మిది మృతదేహాలను బయటకు తీసుకువచ్చారు. ప్రమాద సమయంలో శ్రీశైలం జలవిద్యుత్ కేంద్రం లో మొత్తం 19 మంది సిబ్బంది ఉండగా, వారిలో 10 మంది సిబ్బంది ప్రాణాలతో బయట పడ్డారు. మిగతావారు లోపల చిక్కుకుపోయారు.
శ్రీశైలం అగ్ని ప్రమాదంలో లోపల చిక్కుకున్న అందరూ మృతి
షార్ట్ సర్క్యూట్ కారణంగా జరిగిన అగ్ని ప్రమాదంలో దట్టమైన పొగలు వ్యాపించడంతో వారు బయటకు రాలేక పోయారని అధికార యంత్రాంగం చెప్తుంది. అయితే వారిని ప్రాణాలతో రక్షించాలని శతవిధాల ప్రయత్నించినప్పటికీ, అందరూ విగత జీవులైన పరిస్థితి ఆవేదనకు గురి చేస్తుంది. ప్రమాద ఘటనలో చిక్కుకొని కొందరు మంటల్లో కాలిపోగా , కొందరు దట్టమైన పొగ కారణంగా ప్రాణాలు కోల్పోయారు . వారిని ప్రాణాలతో రక్షించాలని ప్రభుత్వం చేసిన ప్రయత్నాలు విఫలం అయ్యాయి .
మరణించిన వారి వివరాలివే
మరణించిన వారి వివరాలు చూస్తే హైదరాబాద్ కు చెందిన డిఈ శ్రీనివాస్ గౌడ్, పాల్వంచ కు చెందిన ఏఈ వెంకట్రావు, హైదరాబాద్ కు చెందిన ఏఈలు మోహన్ కుమార్, ఉజ్మా ఫాతిమా,సూర్యాపేటకు చెందిన ఏఈ సుందర్,ఖమ్మం జిల్లాకు చెందిన ప్లాంట్ అటెండెంట్ రాంబాబు, పాల్వంచకు చెందిన జూనియర్ ప్లాంట్ అటెండెంట్ కిరణ్ , హైదరాబాద్ అమర్ రాజా కంపెనీకి చెందిన వినేష్ కుమార్,మహేష్ కుమార్ లు ఉన్నారు . వారి మృతదేహాలను వెలికి తీశారు.
ఎస్కేప్ టన్నెల్ దగ్గరకు వెళ్ళినా తప్పించుకోలేకపోయిన సిబ్బంది
మొదట ఏఈ సుందర్ నాయక్ మృతదేహం కనిపించింది. ఆ తర్వాత మరో ఐదుగురి మృతదేహాలు కనిపించాయి. అందులో ముగ్గుర్ని సుందర్, ఫాతిమా, మోహన్ కుమార్ గా గుర్తించారు. మిగతా ఇద్దరు కాలిపోవటంతో గుర్తించటం కష్టంగా మారింది. మరో ఎస్కేప్ టన్నెల్ దగ్గర మూడు మృతదేహాలు లభ్యమయ్యాయి. లోపలి నుంచి తప్పించుకునే క్రమంలో వారు ప్రాజెక్టు మరో ఎస్కేప్ టన్నెల్ వైపు పరుగులు పెట్టారు. కానీ ఫలితం లేకపోయింది . వారు అక్కడే మృతిచెందారు. కాలిపోవడంతో... రాంబాబు, వెంకట్ రావు బాడీల గుర్తింపు కష్టంగా మారింది. ఈ ప్రమాదంలో చిక్కుకున్న తొమ్మిది మంది మృతిచెందడం విషాదంగా మారింది.
9 మంది మృతి .. మిన్ను ముడుతున్న మృతుల కుటుంబాల రోదనలు
ప్రమాదం జరిగిన తర్వాత వారిని రెస్క్యూ చెయ్యటానికి 12 గంటల సమయం పట్టిందని , ఈ ఘటనకు విద్యుత్ శాఖామంత్రి , సీఎం కేసీఆర్ బాధ్యత వహించాలని ప్రతిపక్ష పార్టీలు నిప్పులు చేరుగుతున్నాయి. ప్రమాదం జరిగిన వెంటనే వారిని కాపాడే ప్రయత్నం చేస్తే బ్రతికే అవకాశాలు ఉండేవన్న భావన వ్యక్తం అవుతుంది. తమ వారి కోసం ఆందోళనతో ఎదురు చూసిన మృతుల కుటుంబ సభ్యులు విగత జీవులుగా మారిన తమ వాళ్ళను చూసి కన్నీటి పర్యంతం అవుతున్నారు. తొమ్మిది మంది మృతి చెందటంతో బంధువుల రోదనలతో ఆ ప్రాంతం మారుమోగుతుంది .