తెలంగాణలో మరోసారి భారీగా పెరిగిన కరోనా కేసులు, మరణాలు
హైదరాబాద్: తెలంగాణలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. రాష్ట్రంలో సోమవారం కొత్తగా 94 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2792కి చేరింది. సోమవారం మరో ఆరుగురు మృతి చెందారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 82కి చేరింది.
ఐసీఎంఆర్ సీనియర్ శాస్త్రవేత్తకు కరోనా పాజిటివ్: ఆ భవనం మూసివేత
కాగా, ఈరోజు నమోదైన కేసులన్నీ తెలంగాణ పరిధిలోనివే కావడం గమనార్హం. తాజా కేసులతో తెలంగాణలో మొత్తం లోకల్ కేసుల సంఖ్య 2358కి చేరినట్లై వైద్య ఆరోగ్య శాఖ సోమవారం విడుదల చేసిన హెల్త్ బులెటిన్లో వెల్లడించింది. వలస కార్మికులు, విదేశీయులతో కలుపుకుని రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 2792కు చేరిందని తెలిపింది.
కాగా, రాష్ట్రంలో ప్రస్తుతం 1213 యాక్టివ్ కేసులు ఉన్నట్లు వైద్యారోగ్యశాఖ తెలిపింది.కరోనా నుంచి కోలుకుని ఇప్పటి వరకు 1491 మంది ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. గడిచిన 24 గంటల్లో వలస కార్మికులు, విదేశాల నుంచి వచ్చిన వారిలో ఎవరికీ కరోనా పాజిటివ్ నిర్ధారణ కాలేదని తెలిపింది. వలస కార్మికులు, విదేశాల నుంచి వచ్చిన వారిలో ఇప్పటి వరకు 434 మందికి కరోనా సోకింది.
కాగా, తాజాగా నమోదైన 94 కరోనా పాజిటివ్ కేసుల్లో ఒక్క జీహెచ్ఎంసీ పరిధిలోనే 79 కేసులు వెలుగుచూశాయి. రంగారెడ్డి జిల్లాలో 3, మేడ్చల్లో 3 కేసులు నమోదయ్యాయి. మెదక్, నల్గొండ, సంగారెడ్డి జిల్లాల్లో రెండేసి కేసుల చొప్పున నమోదయ్యాయి. మహబూబాబాద్, పెద్దపల్లి, జనగాం జిల్లాల్లో ఒక్కో కేసు చొప్పున నమోదయ్యాయి.
ఇక దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు 1,94,700 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 94,835 యాక్టివ్ కేసులున్నాయి. 94,283 మంది కరోనా నుంచి కోలుకున్నారు. 5,571 మంది కరోనా బారినపడి ప్రాణాలు కోల్పోయారు.