తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు: 16వేల మార్క్ దాటాయి, మరో 7 మరణాలు
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో రోజు రోజుకు కరోనా పాజిటివ్ కేసులు భారీగా పెరుగుతూనే ఉన్నాయి. మంగళవారం ఒక్కరోజే పెద్ద సంఖ్యలో కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో 945 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు వైద్యరోగ్య శాఖ ప్రకటించింది. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 16,339కు చేరింది.
తెలంగాణలో మంగళవారం 1712 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. దీంతో మొత్తం కోలుకున్న వారి సంఖ్య 7294గా ఉంది. మంగళవారం సాయంత్రం 5గంటల వరకు కరోనాతో ఏడుగురు మృతి చెందారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 260కి చేరింది.
మంగళవారం గుర్తించిన కరోనా కేసుల్లో జీహెచ్ఎంసీ తోపాటు ఇతర జిల్లాల్లోనూ ఎక్కువగా ఉన్నాయి. ఒక్క జీహెచ్ఎంసీ పరిధిలోనే 869 కరోనా కొత్త కేసులు నమోదు కావడం గమనార్హం. ఆ తర్వాత రంగారెడ్డి జిల్లాలో అత్యధిక కేసులు నమోదయ్యాయి. రంగారెడ్డి జిల్లాలో 21 కొత్త కేసులు నమోదయ్యాయి.
మేడ్చల్ జిల్లాలో 13 కేసులు నమోదయ్యాయి. నిర్మల్ జిల్లాలో 4, మహబూబ్ నగర్, కరీంనగర్ జిల్లాలో 2, సిద్దిపేట, సూర్యాపేట, ఖమ్మం, వికారాబాద్, నిజామాబాద్ జిల్లాల్లో ఒక్కో కేసు నమోదైంది. మంగళవారం 3457 కరోనా టెస్టులు చేయగా 945 కేసులు బయటపడ్డాయి. దీంతో కరోనా టెస్టుల సంఖ్య 88,563కు చేరింది.
ఇక దేశ వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 5,76,872కు చేరింది. దేశంలో 2,16,987 యాక్టివ్ కేసులున్నాయి. 3,42,747 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దేశంలో ఇప్పటి వరకు 17,073 మంది మరణించారు.