ఎలక్షన్ షాక్ : ముఖ్యమంత్రి నిధులు పక్కదారి పట్టాయా.. ఆర్టీఐ బయటపెట్టిన విషయాలేంటి ?
హైదరాబాద్ : తెలంగాణలో ఎన్నికల వేడి రాజుకుంటోంది. ఈ క్రమంలోనే కేసీఆర్ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే విషయం ఒకటి బయటకు పొక్కింది. కొన్ని అనుకోని పరిణామాలు జరిగితే అంటే కుటుంబ దిక్కును కోల్పోయి,లేదా అనారోగ్యం బారిన పడి వైద్యానికి డబ్బులు లేకుంటే ప్రజలు ముఖ్యమంత్రికి అర్జీ పెట్టుకుంటే ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి వారికి నగదు రూపంలో సహాయం అందుతుంది.
మొత్తం రూ.86.6 కోట్లు విడుదల... అర్హులకు చేరింది మాత్రం రూ.1.69 కోట్లు
సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి జూన్ 2014 నుంచి ఆగష్టు 2015 వరకు రూ.86.6 కోట్లు విలువైన 12,462 చెక్కులకు ప్రభుత్వం క్లియరెన్స్ ఇచ్చింది. కేసీఆర్ సర్కార్ ఎవరికైతే ఈ చెక్కులను పంపిణీ చేసిందో వారి పేర్లను నమోదు చేసింది. ఇందులో కేవలం 182 చెక్కులనే విడుదల చేసినట్లు అదికూడా రూ. 1.69 కోట్లు మాత్రమే రిలీజ్ చేసినట్లు రికార్డుల్లో నమోదయ్యాయి. మిగతా 98.5శాతం అర్హుల పేర్లు మాత్రమే అందులో రికార్డయ్యాయి. వారికి సంబంధించిన వివరాలు మాత్రం నమోదు కాలేదు. హైదరబాద్లోని అవినీతిపై పోరాటం చేస్తున్న సామాజిక కార్యకర్త విజయ్ గోపాల్ ఆర్టీఐ వద్ద పిటిషన్ దాఖలు చేయడంతో ఈ షాకింగ్ వివరాలు బయటకొచ్చాయి.
కేటీఆర్ ట్వీట్తో సీఎం రిలీఫ్ ఫండ్కు విరాళాల వరద
పాలనా విభాగం నుంచి వచ్చిన 700 పేజీల నివేదికను పరిశీలించిన తర్వాత మిగతా రూ. 84.9 కోట్లు ప్రభుత్వం ఎవరికి ఇచ్చిందో ఎక్కడ ఖర్చు చేసిందో అనేదానిపై వివరాలు లేవని విజయ్ గోపాల్ తెలిపారు. ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా గత 46 నెలల్లో 1.2 లక్షల కుటుంబాలు లబ్ధి పొందాయంటూ ఆపద్ధర్మ మంత్రి కేటీఆర్ ఈ ఏడాది ఏప్రిల్లో ట్వీట్ చేశారని విజయ్ గోపాల్ గుర్తు చేశారు. ఇది సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ ట్వీట్తో చాలామంది ప్రజలు స్వచ్చందంగా ముందుకొచ్చి ముఖ్యమంత్రి సహాయనిధికి దారాళంగా విరాళాలు ఇచ్చారు.
నిధులు విడుదల చేసే సమయంలో వివరాలు ఎందుకు నమోదు చేయలేదు..?
ప్రొటోకాల్ ప్రకారం రాష్ట్ర రెవిన్యూ శాఖ అర్హుల ఫోన్ నెంబర్లు, గుర్తింపు వివరాలు, ఎందుకోసం నిధులు విడుదల చేస్తున్నారో నమోదు చేయాల్సి ఉంది. ఉదాహరణకు చికిత్స కోసం సహాయం చేయాలని ఎవరైనా అర్జీ పెట్టుకుంటే ఆ వ్యక్తి పేరు, చికిత్స పొందుతున్న వివరాలు, హాస్పిటల్ వివరాలు నమోదు చేయాలి. మొత్తం 15 కేటగిరీల వారీగా దరఖాస్తు నింపాల్సి ఉంటుంది. ఆ తర్వాతే ఆమోదం లభిస్తుంది. కానీ ఇక్కడ పరిస్థితి వేరుగా ఉంది. అదే గోపాల్ ప్రశ్నించారు. ఎలాంటి వివరాలు నమోదు చేయకుండా నిధులు ఎలా విడుదల చేస్తారని ప్రశ్నిస్తున్నారు. నిధుల విడుదల ఆర్థిక ఇబ్బందులతోనా, లేదా మానవీయ కోణంలో చేస్తున్నారా అనేది ఎందుకు నమోదు చేయలేదని ఆయన ప్రశ్నించారు. ఇది ప్రజలకు తెలియాల్సిన విషయాలని చెప్పారు. వివరాలు నమోదు చేయకుండా ప్రజల డబ్బును ఎలా ఇస్తారని ప్రశ్నించారు విజయ్ గోపాల్. అంతేకాదు ఒకే నెంబరుతో ఉన్న చెక్కులను చాలామందికి ఇచ్చినట్లు తన దృష్టికి వచ్చిందని చెప్పారు.
సీఎం నిధులు పక్కదోవ పట్టడంపై హెకోర్టులో పిల్ దాఖలు
కేసీఆర్ ప్రభుత్వంలో అవినీతి జరిగిందని చెప్పేందుకు ఆర్టీఐ సాక్షమని ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ విమర్శించింది. కేసీఆర్ కార్యాలయంలో భారీగా అవినీతి జరుగుతోందని ధ్వజమెత్తారు కాంగ్రెస్ నేత దాసోజు శ్రవణ్. కేసీఆర్ ప్రభుత్వం గారడీ ప్రభుత్వమని మండిపడ్డారు. ఇలా చాలా నిధులు పక్కదారి పడుతుండటంతో తాను సీబీ సీఐడీకి ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. అయితే ఇప్పటి వరకు కేసుకు సంబంధించి ఎలాంటి అప్డేట్ ఇవ్వలేదని కేసు విచారణలో ఉంది కనుక ఎలాంటి వివరాలు ఇప్పుడే వెల్లడించలేమని అధికారులు చెబుతున్నట్లు విజయ్ గోపాల్ తెలిపారు. సీఎం రిలీఫ్ ఫండ్ నిధులు పక్క దోవ పడుతున్నాయంటూ వీటిపై విచారణ జరపాలంటూ హైకోర్టులో తాను పిల్ దాఖలు చేసినట్లు చెప్పారు.