ప్రియుడి మోసం: పదో తరగతి విద్యార్థిని ఆత్మహత్య
మహబూబాబాద్: ప్రేమించి పెళ్లి చేసుకుంటానని ప్రియుడు మోసం చేయడంతో ఓ విద్యార్థిని పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ విషాద ఘటన మహబూబాబాద్ పట్టణ శివారులోని సిగ్నల్ కాలనీలో చోటు చేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మహబూబాబాద్ పట్టణ శివారులోని సిగ్నల్ కాలనీకి చెందిన పండ్ల వ్యాపారం చేసుకుని జీవించే మనుబోతు యశోద మూడవ కుమార్తె శిరీష(17) పట్టణంలోని ప్రభుత్వ బాలికోన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతోంది.
కాగా, శిరీషకు ఇదే కాలనీకి చెందిన శ్యామల మల్లయ్య కుమారుడు కార్తీక్తో పరిచయం ఏర్పడి, అది ప్రేమకు దారితీసింది. కొద్ది రోజుల క్రితం కార్తీక్, శిరీల మధ్య పెళ్లి విషయం రావడంతో ఆ యువకుడు శిరీషను వివాహం చేసుకోనని తెగేసి చెప్పాడు.
దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన శిరీష.. డిసెంబర్ 23న పురుగుల మందు తాగింది. అపస్మారక స్థితిలో ఉన్న ఆమెను మానుకోట ఏరియా ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ ఆదివారం ప్రాణం విడిచింది. శిరీష ఆత్మహత్యకు కారణమైన కార్తీక్పై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.