తల్లి కాని తల్లికి వారంరోజుల పాపను అప్పగించిన నర్స్
పిల్లలు లేక పది సంవత్సరాలు తపించిన తల్లికి సంగారెడ్డిలోని మాతశిశు సంక్షేమ ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యం కడుపుకొతను మిగిల్చింది. వారం రోజుల పాపను స్వంత తల్లికి అప్పగించకుండా గుర్తు తెలియని మహిళకు అప్పగించారు. దీంతో అసలు విషయం తెలుసుకున్న స్వంత తల్లిదండ్రులు ఆందోళన బాటపట్టారు. ఆగ్రహంతో ఆసుపత్రిపై దాడులు చేశారు.
సంగారెడ్డి జిల్లా మాతశిశు సంక్షేమ ఆసుపత్రి నిర్లక్ష్యంతో వారం రోజుల పాప మాయమయింది. కల్పకూరు గ్రామానికి చెందిన మాధవి, మల్లేశం లకు వారం రోజుల క్రితం ఓ పాప జన్మించింది. అయితే ఆ పాపకు జాండీస్ రావడంతో ఆసుపత్రిలో చికిత్స చేయిస్తున్నారు. అయితే రోజులాగే ఈరోజు కూడ పాపను చికిత్స కోసం ఆసుపత్రి ఆయాకు మాధవి అప్పగిచ్చింది. కాసేపటి తర్వాత పాప ఏడుస్తుండడంతో తిరిగి తల్లికి అప్పగించేందుకు తీసుకువచ్చిన ఆయా తల్లి మాధవికి కాకుండా ఇతర మహిళకు ఇచ్చి వెళ్లిపోయింది. అయితే పాపను తీసుకున్న మహిళ నేరుగా బయటకు వెళ్లిపోయింది. దీంతో అసలు తల్లిదండ్రులు పాప కోసం వెతకడంతో కనిపించలేదు. అయితే మాధవి అనే పేరు మీద ఇద్దరు తల్లిదండ్రులు ఉండడంతో ఆయా కన్శూజ్ అయినట్టు చెబుతున్నా... ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యంతోనే పాపను ఇతరులకు అప్పగించారని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఆసుపత్రికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు.