నగరంలో ర్యాలీలు, ఊరేగింపులు నిషేధం..! శాంతి భద్రతలకు భంగం కలగనివ్వమంటున్న డీజీపి..!!
హైదరాబాద్: జమ్మూకశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370 రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అన్ని రాష్ట్రాలకు కేంద్రం నుంచి హెచ్చరికలు జారీ అయ్యాయి. తెలంగాణలోని పోలీసులు, ఉన్నతాధికారులు అప్రమత్తంగా ఉండాలని పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించాలని కేంద్రం ఆదేశించింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా పోలీస్ కమిషనర్లు, జిల్లాల ఎస్పీలతో డీజీపీ మహేందర్రెడ్డి కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ముఖ్యంగా హైదరాబాద్, సైబరాబాద్ కమిషనరేట్ల పరిధిలోని సునిశిత ప్రాంతాల్లో 144వ సెక్షన్ విధించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ర్యాలీలు, ఊరేగింపులను పూర్తిగా నిషేధించారు. ఇదిలా ఉండగా జమ్మూకశ్మీర్పై కేంద్ర ప్రభుత్వం ఇవాళ ప్రవేశపెట్టిన రెండు బిల్లులకు అనేక పార్టీలు మద్దతు తెలిపాయి. బహుజన్ సమాజ్వాదీ పార్టీ, అన్నాడీఎంకే, బీజేడీ, వైఎస్ఆర్ లాంటి పార్టీలు ఆ బిల్లులకు మద్దతు తెలిపాయి. ఆమ్ ఆద్మీ పార్టీ కూడా కేంద్ర నిర్ణయానికి జై కొట్టింది.
ఐతే 370ని రద్దు చేస్తే కశ్మీర్లో శాంతి వికసిస్తుందని ఆశిస్తున్నట్లు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ తన ట్విట్టర్లో పేర్కొన్నారు. కాగా కేంద్ర నిర్ణయాన్నికాంగ్రెస్, ఎస్పీ,తృణమూల్ కాంగ్రెస్, సీపీఎం, సీపీఐ, కేరళ కాంగ్రెస్ పార్టీలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్టు తెలిపారు. తమిళనాడుకు చెందిన ఎండీఎంకే నేత వైకో .. కశ్మీర్పై ప్రవేశపెట్టిన 370 ఆర్టికల్ రద్దును వ్యతిరేకించారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని ఆరోపించారు. జమ్ముకశ్మీర్ అంశంలో ఆర్టికల్ 370ని రద్దు చేస్తూ భారత ప్రభుత్వం ఈరోజు చరిత్రాత్మక నిర్ణయం తీసుకుంది.
ఆర్టికల్ 370ని రద్దుతో పాటు ఆ రాష్ట్రాన్ని రెండు ముక్కలుగా విడగొట్టి, కేంద్ర పాలిత ప్రాంతాలుగా మారుస్తున్నట్లు ప్రకటించింది. క్షణాల వ్యవధిలో మారిపోయిన పరిణామాలతో యావత్ భారతదేశం ఉక్కిరిబిక్కిరి అవుతోంది. ఈ పరిణామాలతో పాకిస్థాన్ కూడా కశ్మీర్ అంశాన్నే ఫోకస్ చేసింది. భారత్ లో ఏం జరుగుతోందా? అనే అక్కడి మీడియా ఉత్కంఠంగా పరిశీలిస్తోంది. పాక్ మీడియాలో పూర్తిగా భారత్ కు సంబంధించిన వార్తలే కనిపిస్తున్నాయి. పాక్ మీడియాలో వస్తున్న కొన్ని హెడ్ లైన్స్ కూడా ఉత్కంఠభరింతగా ఉన్నాయి.