బంగారు తెలంగాణ క్రికెట్ టోర్నీలో విషాదం: బౌలింగ్ వేస్తూ క్రికెటర్ మృతి(వీడియో)
హైదరాబాద్: నగరంలోని బంజారాహిల్స్లో విషాద ఘటన చోటుచేసుకుంది. రోడ్ నెం.10లో ఓ యువకుడు క్రికెట్ ఆడుతూ ఆకస్మికంగా మృతి చెందాడు. అప్పటి వరకు ఉత్సాహంగా క్రికెట్ ఆడిన అతడు కుప్పకూలడంతో సహచరులంతా ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురయ్యారు.
జహీరానగర్లోని ఖాళీ మైదానంలో క్రికెట్ ఆడుతుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.. శుక్రవారం రాత్రి బంగారు తెలంగాణ క్రికెట్ టోర్నమెంట్ మ్యాచ్ జరిగింది.
ఈ మ్యాచ్లో ఆంథోని లాయిడ్(23) అనే యువకుడు బౌలింగ్ వేస్తూ ఒక్కసారిగా కుప్పకూలాడు. వెంటనే సహచర ఆటగాళ్లు అతన్ని ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు.
ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు. ఆంథోనీ హోటల్ మేనేజ్మెంట్ చేస్తూ, పార్ట్ టైం ఉద్యోగం కూడా చేస్తున్నట్లు తెలిసింది. ఆంథోనీ మృతితో అతని కుటుంబంలో విషాదం నెలకొంది.