‘పరీక్ష రాయనివ్వం’: మనస్తాపంతో బీటెక్ విద్యార్థి ఆత్మహత్య
మేడ్చల్: పరీక్ష రాసేందుకు కాలేజీ యాజమాన్యం అనుమతించకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఓ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన మేడ్చల్ జిల్లాలో చోటు చేసుకుంది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
కీసర మండలంఎస్వీ నగర్లో నివాసం ఉండే రావి నాగేందర్ రెడ్డి కుమారుడైన అభిషేక్ రెడ్డి(20) ఘట్కేసర్ మండలంలోని అవుశాపూర్ విజ్ఞాన్ భారతి ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ రెండో సంవత్సరం చదువుతున్నాడు. 50శాతం మాత్రమే హాజరుశాతం ఉండటంతో అతడ్ని కళాశాల యాజమాన్యం పరీక్షలు రాయడానికి అనుమతించలేదు.
ఈ క్రమంలో మనస్తాపం చెందిన అభిషేక్ రోజూలాగే బుధవారం కూడా కాలేజీకంటూ బయల్దేరాడు. కానీ, కాలేజీ సాయంత్రమైనా ఇంటికి రాలేదు. కాగా, గురువారం నగరంలోని ఆళ్లగడ్డ వద్ద రైలు ట్రాక్పై తెలియని శవం పడి ఉండటాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.
ఘటనా స్థలంలో మృతుని వద్ద లభించిన ఆధారాలతో అభిషేక్గా పోలీసులు గుర్తించారు. అతని మృతదేహాన్ని పోస్టుమార్టం అనంతరం కుటుంబసభ్యులకు అప్పగించారు. అభిషేక్ మృతితో అతని కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. కళాశాల యాజమాన్యం హాజరు విషయంలో చేసిన వేధింపుల కారణంతోనే అభిషేక్ ఆత్మహత్య చేసుకున్నాడని మృతుని కుటుంబసభ్యులు ఆరోపించారు.