హైటెక్ కాపీయింగ్: అండర్ వేర్లో సెల్ఫోన్, చెవిలో బ్లూటూత్
హైదరాబాద్: హైటెక్ పద్ధతిలో పరీక్షలో కాపీ కొడుతున్న పట్టుబడిన ఓ ఇంజనీరింగ్ విద్యార్థిని కళాశాల యాజనమాన్యం పట్టుకుని పోలీసులకు అప్పగించింది. హైదరాబాదులో గల బండ్లగూడలోని అరోరా ఇంజినీరింగ్ కళాశాలలో హైటెక్ పద్ధతిలో కాపీ కొడుతూ దొరికిపోయిన బీటెక్ విద్యార్థి షేక్వసీం (21)ను కళాశాల యాజమాన్యం చాంద్రాయణగుట్ట పోలీసులకు అప్పగించింది.
మలక్పేటలోని నవాబ్షా కళాశాలలో బీటెక్ తృతీయ సంవత్సరం చదువుతున్న షేక్వసీం సప్లిమెంటరీ పరీక్ష రాసేందుకు హైటెక్ పరికరాలను ఉపయోగించి తనిఖీలో దొరికిపోయాడు. స్మార్ట్ఫోన్ను అండర్ వేర్లో అమర్చుకుని, చెవిలో ఇమిడిపోయే బ్లూటూత్ పెట్టుకొని పరీక్షహాలుకు వచ్చాడు. వాటితో పాటు బనియన్ అంచుల్లో కుట్టిన ట్రాన్స్మిటర్ కేబుల్ కూడా బయట పడింది.
వెలుపల నుంచి ఫోన్లో అందించే సమాచారం ఆధారంగా పరీక్షల్లో సమాధానాలు రాశాడని పోలీసులు తెలిపారు. మార్కెట్లో పదివేలకు ఈ పరికరాలను కొనుగోలు చేసినట్టు వసీం పోలీసులకు చెప్పాడు. పరీక్ష రాయడానికి వసీంకు సహాయపడినవారిని కూడా అదుపులోకి తీసుకుని విచారిస్తామని పోలీసులు తెలిపారు.
శుక్రవారం మధ్యాహ్నం జరిగిన ధర్మల్ ఇంజనీరింగ్ సబ్దెక్టులో కాపీ కొడుతూ ఆ విద్యార్థి పట్టుబడ్డాడు. పాఠశాల డైరెక్టర్ చేపూరి శ్రీలత తన బృందంతో కలిసి విద్యార్థులను పరిశీలిస్తుండగా, వారిని చూసి పరీక్ష రాస్తున్న షేక్ వసీం అహ్మద్ ఒక్కసారిగా తన పేపర్ను అక్కడే వదిలేసి బయటకు పరుగు తీశాడు.
దాంతో సిబ్బంది అతన్ని వెంబడించి పట్టుకుని క్షుణ్నంగా తనిఖీ చేయగా హైటెక్ పరికరాలు బయటపడ్డాయి. బయటి నుంచి కాల్ వచ్చిన వెంటనే నాలుగైదు రింగులకు ఆటోమేటిక్గా ఫోన్ రిసీవ్ కావడం, రిసీవ్ అయిన వెంటనే వైర్లెస్ ట్రాన్స్మీటర్ స్వీకరించడం, దాని నుంచి బ్లూటూత్తు ఆడియో రిసీవింగ్ అవుతున్నట్లు కనిపెట్టారు.
ఫోన్ చేసినవారి వివరాలు, సమయం లభ్యం కాకుండా ఫోన్లో సాఫ్ట్వేర్ను మార్చేసినట్లు కూడా అధికారులు గుర్తించారు. తాను ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఉండే స్నేహితుడి ద్వారా ఈ మాస్ కాపీయింగ్ చేస్తున్నానని వసీ అహ్మద్ మీడియా ప్రతినిధులకు చెప్పాడు.