మ్యాట్రిమోని సైట్ ద్వారా వల: మహిళ నుంచి రూ. 65వేలు కాజేసిన నైజీరియన్
హైదరాబాద్: కట్టుకున్న భర్త, కన్న బిడ్డలు చనిపోవడంతో తోడు కోసం మ్యాట్రిమోని సైట్లో వివరాలు నమోదు చేసుకుందో 65ఏళ్ల మహిళ. అయితే ఎవరూ లేని ఆ ఒంటరి మహిళను ఓ నైజీరియన్ పెళ్లి పేరుతో నమ్మించి.. రూ.65వేల మేర మోసం చేశాడు. మళ్లీ డబ్బు పంపాల్సిందిగా ఫోన్ రావడంతో అనుమానించిన ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్ అమీర్పేటలోని ఒక అపార్ట్మెంట్లో 65 ఏళ్ల మహిళ ఒంటరిగా నివసిస్తోంది. ఆమె గతంలో ఓ బ్యాంకులో ఉద్యోగం చేసి రిటైరైంది. ఎనిమిదేళ్ల క్రితం ఆమె భర్త గుండెపోటుతో మృతి చెందారు. వారి కుమార్తె డాక్టర్ కాగా, కుమారుడు ఇంజనీర్. వారిద్దరూ కూడా రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు.
ఒంటరితనాన్ని భరించలేని ఆ వృద్ధురాలు మూడు నెలల క్రితం ఒక మ్యాట్రిమోనీ వెబ్సైట్లో తన వివరాలు నమోదు చేసుకుంది. వెంటనే ఒక నైజీరియన్ ప్రొఫైల్ వివరాల ద్వారా ఆమెను సంప్రదించాడు. తన పేరు చార్లెస్ బ్రౌన్ అని.. తనది యూకే అని చెప్పుకొంటూ ఆమెతో చాట్ చేశాడు. పెళ్లి చేసుకుంటానని.. యూకే నుంచి వస్తున్నానని చెబితే నమ్మింది. దీంతో అతడు ఆగస్టు 24న ఢిల్లీ విమానాశ్రయంలో దిగినట్లు ఫోన్ చేశాడు.
అయితే, యూకే నుంచి వచ్చేటప్పుడు చాలా ఫోన్లు, అధిక మొత్తంలో నగదు తేవడంతో ఎయిర్పోర్ట్లో కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారని చెప్పాడు. తర్వాత కొద్దిసేపటికి.. కస్టమ్స్ అధికారి శ్వేత భాటియా అనే పేరుతో ఒక మహిళ ఫోన్ చేసి ‘చార్లెస్ బ్రౌన్ మీ ఫోన్ నెంబరే ఇచ్చాడు. పన్ను చెల్లించకపోతే ఇద్దరూ జైలుకు వెళ్లాల్సిందే' అంటూ బెదిరింపు ధోరణిలో మాట్లాడింది. దీంతో భయపడిన వృద్ధురాలు ఆమె సూచించిన అకౌంట్లో రూ.65 వేలు జమ చేసింది.
మంగళవారం అతడు ఢిల్లీ నుంచి జెట్ ఎయిర్వేస్ ద్వారా హైదరాబాద్ వచ్చేస్తాడని ఎదురు చూసిన ఆమెకు నిరాశేఎదురైంది. బుధవారం వృద్ధురాలికి నైజీరియా ముఠా నుంచి మళ్లీ ఫోన్ వచ్చింది. రూ.65 వేలకు కస్టమ్స్ ఆఫీసర్ ఒప్పుకోలేదని మరో రూ.65 వేలు కావాలని, ఈ మొత్తాన్ని మొదట వేసిన అకౌంట్లో జమ చేయాలని వారు కోరారు.
దీంతో అనుమానం వచ్చిన ఆమె హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. విచారించిన పోలీసులు ఇది నైజీరియన్ ముఠా మోసంగా గుర్తించి దర్యాప్తు ప్రారంభించారు. ప్రత్యేక్ష పరిచయం లేకుండా ఇతర వ్యక్తులతో పరిచయాలు పెంచుకోవద్దని, మాయ మాటలు నమ్మి అకౌంట్లలో నగదు జమ చేయవద్దని సైబర్ క్రైమ్స్ ఏసిపి డాక్టర్ బి అనూరాధ సూచించారు.