కెసిఆర్, హరీశ్పై ఆరోపణలు: టిడిపి నేత ప్రతాప్రెడ్డిపై కేసు నమోదు
మెదక్: తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు, మంత్రి హరీశ్రావులపై ఆరోపణలు చేసిన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి వంటేరు ప్రతాప్రెడ్డిపై సంగారెడ్డి పట్టణ పోలీస్స్టేషన్లో కేసు నమోదైంది. ఈ మేరకు సిఐ ఆంజనేయులు తెలిపారు.
ఆగస్టు 14న టిడిపి జిల్లా కార్యాలయంలో ప్రతాప్రెడ్డి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కెసిఆర్ను విమర్శించారని, మంత్రి హరీశ్రావుకు బెంగళూరులో వందల ఎకరాలలో ఫాంహౌస్ ఉందని, గజ్వేల్, సిద్దిపేటలలోనూ అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నట్టు ఆరోపణలు చేశారన్నారు.
దీనిపై టిఆర్ఎస్ మాజీ ఎమ్మెల్సీ ఆర్ సత్యనారాయణ శనివారం ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆదివారం కేసు నమోదైంది. ప్రతాప్రెడ్డిపై కేసు నమోదు చేశామని, ఎస్ఐ గణేష్ను విచారణ అధికారిగా నియమించామని సిఐ ఆంజనేయులు తెలిపారు.
మంత్రి తుమ్మల వ్యాఖ్యలు అనైతికం: పోతినేని
మంత్రి తుమ్మల నాగేశ్వరావు ఎమ్మెల్సీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఇతర పార్టీలకు చెందిన జడ్పీటీసీ, ఎంపీటీసీలను టీఆర్ఎస్లోకి ఫిరాయింపు చేయాలని దిగజారుడు వ్యాఖ్యలు చేయడం అనైతికమని సిపిఎం జిల్లా కార్యదర్శి పోతినేని సుందర్శన్రావు మండిపడ్డారు. ఆదివారం ఆ పార్టీ జిల్లాకార్యాలయంలో మీడియాతో మాట్లాడారు.
స్థానిక ప్రతినిధులను తీసుకువచ్చిన వారికి నామినేటెడ్ పదవుల విషయంలో మొదటి ప్రాధాన్యత ఇస్తానని పార్టీ శ్రేణులకు చెప్పడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. ఈ విషయాలను జిల్లా కమిటీ తీవ్రంగా ఖండిస్తుందన్నారు. ఇటువంటి వ్యక్తి రాజ్యాంగపరమైన పదవుల్లో కొనసాగే నైతికహక్కు లేదన్నారు.